Saturday 12 September 2015

ఏపీ సముద్రతీర ప్రాంతాల్లో చమురు నిల్వలు

ఏపీ సముద్రతీర ప్రాంతాల్లో చమురు నిల్వలు
Updated :12-09-2015 12:46:15
  •  యారాడ కొండల దిగువన ఏర్పాటు
  •  భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
 
విశాఖ మహానగరం రానున్న రోజుల్లో చమురు కేంద్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారనుంది. భవిష్యత్‌లో పారిశ్రామిక ప్రాంతానికి ప్రపంచ చిత్రపటంలో గుర్తింపు రానుంది. చమురు, గ్యాస్‌ నిల్వలకు సంబంధించి యారాడ కొండల దిగువన సముద్ర తీరా ప్రాంతానికి సమీపంలో భారీ సొరంగాలతో ఎస్‌ఏఎల్పీజీ (గ్యాస్‌ నిల్వల) ప్రాజెక్ట్‌, ఐఎస్‌పీఆర్‌ఎల్‌ (చమురు నిల్వల) ప్రాజెక్ట్‌ ఈ ప్రాంతంలో నిర్మించడంతో అందరి దృష్టి ఈ ప్రాంతంపైనే వుంది. ఈ నేపథ్యంలో తీర ప్రాంత భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగానే మెరైన్‌ అకాడమీ ఏర్పాటు చేయనుంది.
 మల్కాపురం: ఆసియా ఖండంలో ఎక్కడా లేని విధంగా పచ్చగా వున్న యారాడ కొండలను లోతుగా తవ్వి సొరంగాలను ఏర్పాటు చేసి ఆ కొండల గర్భంలో గ్యాస్‌ నిల్వలను భద్రం చేశారు. ఈ ప్రాజెక్ట్‌కు ఎస్‌ఏఎల్పీజీ అనే నామకరణం కూడా చేశారు. ఈ ప్రాజెక్ట్‌లో వున్న సొరంగాల్లో విదేశాల నుంచి నౌకల ద్వారా వచ్చే గ్యాస్‌ నిల్వలను ఉంచుతారు. దేశంలో గ్యాస్‌ కొరత ఏర్పడినప్పుడు ఈ భూగర్భంలో వున్న గ్యాస్‌ నిల్వలను ఉపయోగిస్తారు. దాదాపుగా 45 రోజులు వరకు దేశం అంతటికి ఈ గ్యాస్‌ నిల్వలు సరిపోయే విధంగా వుంటాయి. ఈ ప్రాజెక్ట్‌ను ఫ్రాన్స్‌ దేశ (టోటల్‌) సంస్థ నిర్మించింది. ఈ ప్రాజెక్ట్‌ ఇలా వుంటుండగానే దీనికి సమీపంలో షిప్‌యార్డు ఓపీఎఫ్‌ పక్కనే వున్న కొండల్లో క్రూడ్‌ ఆ యిల్‌ నిల్వ ఉంచేందుకు ఐఎస్‌పీఆర్‌ఎల్‌ సంస్థ శ్రీకారం చుట్టింది. ఈ సంస్థ పనులు దాదాపుగా పూర్తయినప్పటికీ ప్రారంభం కోసం ఎదురుచూస్తున్నారు. 
 
ప్రాజెక్టులో మూడు సొరంగాలు
ఈ ప్రాజెక్ట్‌లో మూడు సొరంగాలు ఉంటాయి. ఈ మూడు సొరంగాల్లో చమురు నిల్వలను ఉంచుతారు. నౌకల ద్వారా వచ్చే చమురు పైప్‌ల ద్వారా ఈ సొరంగంలోకి పంపుతారు. హెచ్‌పీసీఎల్‌, ఐఎస్‌పీఆర్‌ఎల్‌ సంస్థలు ఈ ప్రాజెక్ట్‌ను సంయుక్తంగా నిర్మించారు. ఇటీవల ఈ ప్రాజెక్ట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ వివిధ కారణాల వలన ఈ ప్రొజెక్ట్‌ను ప్రారంభించలేదు. అయితే ఇప్పుడు ఏ ప్రాజెక్ట్‌ ఎప్పుడు ప్రారంభమవుతుందోనని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్‌లు కూడా తీర ప్రాంతంలో వున్నాయి. ఈ దశలో హెచ్‌పీసీఎల్‌ కూడా తమ చమురు ఉత్పత్తుల తయారీ శాతాన్ని పెంచుకునేందుకు సంస్థను కోట్లాది రూపాయల పెట్టి విస్తరించనుంది. హెచ్‌పీసీఎల్‌ విస్తరణకు సంబంధించి ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణను కూడా చేపట్టి విస్తరణకు సంబంధించి పనులను ఒక్కొక్కటిగా పూర్తిచేసుకుంటూ వస్తుంది. హెచ్‌పీసీఎల్‌లో ఏడాదికి 8 మెట్రిక్‌ టన్నుల చమురు ఉత్పత్తుల తయారీ అవుతుంది. దీనిని 15 మెట్రిక్‌ టన్నుల శాతానికి పెంచేందుకు హెచ్‌పీసీఎల్‌ అధికారులు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగానే హెచ్‌పీసీఎల్‌ను విస్తరించనున్నారు. ఇదిలావుండగా హెచ్‌పీసీఎల్‌కు చెందిన ఏటీపీ సైట్‌ ద్వారా విశాఖ నుంచి విజయవాడ వరకు చమురును పైప్‌లైన్‌ ద్వారానే పంపుతున్నారు. అంతేకాకుండా ఈ కంపెనీకి సమీపంలో వున్న ఈస్ట్‌ ఇండియా పెటోల్రియం ప్రైవేటు లిమిటెడ్‌ ( ఈ ఐ పీ ఎల్‌) సంస్థ కూడా చమురు ఉత్పత్తుల సామర్ధ్యాన్ని పెంచుకోవడానికి రంగం సిద్దం చేసింది. దీనిలో భాగంగానే ప్రజాభిప్రాయసేకరణ కూడా చేపట్టింది. కానీ దీనిని ప్రజలు అ క్కడికి వచ్చిన కొంతమంది వ్యతిరేకించడంతో మరో సారి ప్రజాభిప్రాయసేకరణను ఏర్పాటు చేయమన్నారు. ఈ సంస్థకు విస్తరించినట్టుయితే మరింత భద్రత అవసరం. అటు చమురు నిల్వలను పంపే పైప్‌లైన్‌ కూడా సముద్ర తీర ప్రాంతం వెంబడే వుంది. ఈ ఐపీఎల్‌ కూడా సముద్ర తీరానికి దగ్గరలోనే వుంది. బీపీసీఎల్‌, ఐవోసీ, బ్లాక్‌ ఆయిల్‌ టెర్మినల్‌, హెచ్‌పీ పెట్రో పార్కు వంటి సంస్థలన్ని కూడా మల్కాపురం పరిధిలోకి వస్తాయి. ఈ పరిశ్రమలన్ని కూడా సముద్ర తీర ప్రాంతంలోనే వున్నాయి. అందుకే తీర ప్రాంతంలో భద్రతను పెంచినట్టయితే ఈ నిక్షేపాలన్నీ ఎంతో భద్రంగా వుం టాయని అందరి భావన.

No comments:

Post a Comment