Thursday 23 July 2015

పుష్కరాల వైఫల్యానికి క్రైస్తవసంఘాల కుట్ర

రాజమండ్రి: పుష్కరాల వైఫల్యానికి క్రైస్తవసంఘాల కుట్ర-బండారు రమేష్‌

రాజమండ్రి, జూలై 23 : పుష్కరాల వైఫల్యానికి మాజీ ఎంపీ హర్షకుమార్‌తోపాటు కొన్ని క్రైస్తవ సంఘాలు కుట్ర పన్నాయని శ్రీరామ్‌సేన రాష్ట్ర అధ్యక్షుడు బండారు రమేష్‌ ఆరోపించారు. రాజమండ్రి తొక్కిసలాటకు వీరు చేసిన ప్రచారమే కారణమని ఆయన పేర్కొన్నారు. హర్షకుమార్‌ దీక్షను భగ్నం చేశారన్న కక్షతో కరెంటు వైర్లు తెగిపడ్డాయని పుకార్లు సృష్టించారని రమేష్‌ చెప్పారు. రాజమండ్రిలో నిన్న జరిగిన అగ్నిప్రమాద ఘటనపై సైతం అనుమానాలున్నాయని రమేష్‌ ఆరోపించారు.

హైదరాబాద్‌ : రాజమండ్రి ఘటనపై హైకోర్టుకు వెళతా - మాజీ ఎంపీ హర్షకుమార్‌ కుమారుడు శ్రీరాజ్‌

హైదరాబాద్‌, జూలై 23 : రాజమండ్రిలో పుష్కరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై తాను హైకోర్టుకు వెళతానని మాజీ ఎంపీ హర్షకుమార్‌ కుమారుడు శ్రీరాజ్‌ చెప్పారు. అధికారులు, పోలీసుల వైఫల్యం వల్లే రాజమండ్రి పుష్కరఘాట్‌ వద్ద తొక్కిసలాట జరిగిందని ఆయన ఆరోపించారు. సీఎం చంద్రబాబు, జిల్లా ఎస్పీ, కలెక్టరు, బోయపాటి శ్రీనులపై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

తొక్కిసలాటలో విద్రోహ చర్యపై చర్చ
రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో విద్రోహ చర్య అంశం మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ‘‘పుష్కరాలు మొదలు కావడానికి ముందు రాజమండ్రి మాజీ ఎంపీ హర్షకుమార్‌ అక్కడ వేరేవారి సమస్యలపై దీక్ష చేశారు. ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. దీనికి నిరసనగా ఆయన అనుచరులు పుష్కరాల ప్రారంభ సమయంలో కరెంటు తీగలు తెగిపడ్డాయని, షాక్‌ కొడుతోందని ప్రజలను భయబ్రాంతులను చేశారని, దాని వల్లే తొక్కిసలాట జరిగిందని మాకు బయటి నుంచి సమాచారం వస్తోంది. దీనిపై విచారణ జరపాలి’’’ అని మంత్రులు అచ్చెన్నాయుడు, పీతల సుజాత కోరారు. ఇది కొత్త కోణమని, దీనిని కూడా న్యాయ విచారణ పరిధిలోకి చేరుద్దామని చంద్రబాబు అన్నారు. తొలి రోజు తాను పుష్కరాల్లో పూజ ముగించి బయటకు వస్తున్నప్పుడు ఒక మహిళ తనను ఆపి కరెంటు తీగలు తెగి పడ్డాయని అంటున్నారని చెప్పారని చంద్రబాబు గుర్తు చేసుకొన్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో భవనాల క్రమబద్ధీకరణ పథకం ప్రవేశపెట్టడానికి మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.

No comments:

Post a Comment