Wednesday 25 May 2016

హోదాపై మహానాడులో తీర్మానం చేయండి

హోదాపై మహానాడులో తీర్మానం చేయండి 
26-05-2016 00:07:43

చంద్రబాబుకు కేవీపీ లేఖ 
న్యూఢిల్లీ, మే 25(ఆంధ్రజ్యోతి): తిరుపతిలో ఈ నెల 27 నుంచి జరగనున్న టీడీపీ మహానాడులో ఏపీకి ప్రత్యేక హోదాపై రాజకీయ తీర్మానం చేయాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబుకు కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం చంద్రబాబుకు కేవీపీ మూడు పేజీల లేఖ రాశారు. ప్రత్యేక హోదాను సాధించడంలో కేంద్రంపై సామ, దాన, భేద దండోపాయాలను ప్రయోగించాలని సూచించారు. హోదా వచ్చే వరకు రాష్ట్రంలోని అన్ని రాజకీయపార్టీలు ‘పరస్పర దూషణ విరమణ’ ఒప్పందం చేసుకోవాలని కేవీపీ తెలిపారు. విభజన జరిగి రెండేళ్లు పూర్తయినా, నాటి ప్రధాని ఇచ్చిన హామీలుగాని, విభజన చట్టంలోని అంశాలు కానీ అమలు కాకపోవడం రాజ్యంగ, చట్ట విరుద్ధాలని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా ఏపీకి జరుగుతున్న అన్యాయంపై పార్లమెంటులో చర్చకు రావాలని కోరారు. రానున్న మూడేళ్ల వరకు మున్సిపల్‌, జిల్లా, పంచాయతీ ఎన్నికలు లేనందున అన్ని రాజకీయ పక్షాలూ తాత్కాలికంగానైనా కలిసి పనిచేస్తేనే, ప్రత్యేక హోదాతో సహా విభజన చట్టంలోని అన్ని అంశాలనూ సాధించుకోవడం సుసాధ్యమన్న ఆకాంక్ష వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment