Tuesday 17 May 2016

జగన్ జలదీక్ష వెనుక భారీ వ్యూహం!

జగన్ జలదీక్ష వెనుక భారీ వ్యూహం!
17-05-2016 12:26:26

నంద్యాల: కర్నూలు జిల్లాలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన జలదీక్ష వెనుక ఆ పార్టీని బలోపేతం చేసేందుకు వ్యూహం ఉన్నట్టు స్పష్టమవుతోంది. గత ఎన్నికల్లో 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు, మూడుస్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. అయితే రెండు నెలల నుంచి చోటుచేసుకున్న పరిణామాలతో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. మొదట నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ టీడీపీలో చేరారు. తదనంతరం పరిణామాలతో కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డారాజశేఖర్‌రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీమోహన్‌రెడ్డిలు వైసీపీకి గుడ్‌బై చెప్పారు. దీంతో రాయలసీమ జిల్లాలో కడప తరువాత అత్యధిక ఎమ్మెల్యేలు కలిగిన కర్నూలు జిల్లాలో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈనేపథ్యంలో వైసీపీని బలోపేతం చేసేందుకే జగన్‌ వ్యూహాత్మకంగా జలదీక్ష కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటున్నట్టు చర్చించుకుంటున్నారు. 

నియోజకవర్గాల నాయకులకు గాలం వైసీపీ ఎమ్మెల్యేలు గుడ్‌బై చెప్పిన స్థానాల్లో పార్టీ బాధ్యతలు అప్పజెప్పేందుకు కొంతమంది స్థానిక నాయకులకు గాలం వేసినట్టు తెలుస్తోంది. కోడుమూరు నుంచి మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ మాత్రమే వైసీపీలోకి చేరారు. మిగతా నాలుగు నియోజకవర్గాల నుంచి ఈ నెల 16, 17, 18 తేదీల్లో జగన్‌ జలదీక్షకు మద్దతు పలుకుతూ ముందుకు వచ్చే నాయకులకు పార్టీ బాధ్యతలకు అప్పగించడమే కాకుండా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లు కూడా ఖరారు చేస్తామన్న హమీతో గాలం వేసేందుకు కొందరు అగ్రనేతలు రంగంలోకి దిగినట్టు సమాచారం. ఇందులో భాగంగానే జగన్‌కు సమీప బంధువులైన కొంతమంది వైసీపీ ముఖ్యనాయకులు బృందంగా ఏర్పడి నంద్యాల, ఆళ్లగడ్డ, శ్రీశైలం,కర్నూలు నియోజకవర్గాల్లో ప్రజాబలం ఉన్న నాయకులతో రహస్యంగా మంతనాలు జరిపినట్టు తెలిసింది. 

వైసీపీ నేతల వ్యూహనికి అడ్టుకట్ట! 
జగన్‌ జలదీక్షకు ముందుగానే ఖాళీగా ఉన్న నియోజకవర్గాల కన్వీనర్ల బాధ్యతలను అప్పజెప్పే ప్రయత్నాలకు అడ్డుకట్ట పడినట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాలో అత్యధిక ముస్లింల ఓట్ల శాతం కలిగిన నంద్యాల, కర్నూలు అసెంబ్లీ నియోజక వర్గాల బాధ్యతలను ఆ వర్గాలకే కేటాయించి వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని స్పష్టంగా చెప్పినా ఎవరూ ముందుకు రానట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలే పార్టీని వీడుతుంటే ప్రస్తుత పరిస్థితుల్లో తాము వైసీపీలోకి చేరితే అధికార పార్టీ నుంచి ఇబ్బందులు వస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. దీనికి వైసీపీ నేతల నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతో ఇప్పటికప్పుడు నియోజకవర్గ బాధ్యతలను స్వీకరించలేమంటూ తెగేసి చెప్పినట్లు తెలిసింది. ముఖ్యంగా ఆళ్లగడ్డ, శ్రీశైలం, నంద్యాల, కర్నూలు నియోజకవర్గాల నాయకులందరూ ఇదే రీతిలో వైసీపీ అగ్ర నాయకుల ముందు తమ వాదన వినిపించినట్టు విశ్వసనీయ సమాచారం. కాగా జలదీక్షకు నాలుగు నియోజకవర్గాల నుంచి జనసమీకరణ, చేయడంలో వైసీపీకి పూర్తిగా చుక్కెదురైనట్టు సమాచారం. శ్రీశైలం నుంచి ఎమ్మెల్యే బుడ్డారాజశేఖర్‌రెడ్డి టీడీపీలో చేరినా ఆయన సోదరుడు బుడ్డాశేషారెడ్డి జగన్‌ జలదీక్షకు హాజరయ్యారు. అయితే బుడ్డాశేషారెడ్డికి నియోజకవర్గ బాధ్యతలను అప్పజెప్పేందుకు వైపీసీ అధినాయకత్వం సుముఖంగా లేనట్లు ఆ పార్టీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. నంద్యాల నుంచి వైసీపీలో చేరిన ఓ ముఖ్యనాయకుడి సమీప బంధువు కూడా తనకు నియోజకవర్గ బాధ్యతలు అప్పజెప్పాలని జగన్‌ను నేరుగా కలిసి కోరినా సానుకూలంగా స్పందించలేదని సమాచారం.

No comments:

Post a Comment