Saturday 10 May 2014

టీఆర్ఎస్ ప్రచారానికి జగన్ మెతుకులు వేశారా ?

టీఆర్ఎస్ ప్రచారానికి జగన్ మెతుకులు వేశారా ?

Published at: 11-05-2014 04:02 AM
ఆయన దోపిడీలో నీ వాటా ఎంత?
ఆ చీకటి ఒప్పందం బయటపెట్టు..కేసీఆర్‌కు శ్రవణ్ సవాల్
ఎమ్మెల్యేలు చేజారకుండా కేసీఆర్ బిల్డప్
అధిష్ఠానంతో టచ్‌లో ఉన్నట్టు పోజు
సీఎంపై మాట తప్పితే తిరుగుబాటు రాదా?
హైదరాబాద్, మే 10 (ఆంధ్రజ్యోతి): "ఎన్నికల సమయంలో వైసీపీ నేత జగన్‌పై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన పార్టీ నుంచి వచ్చిన వారికి టికెట్లు కేటాయించారు. ఇప్పుడు జగన్ సీఎం అవుతారని ప్రకటిస్తున్నారు. దీని వెనక ఉన్న చీకటి ఒప్పందాలు ఏమిటో టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ బహిర్గతం చేయాల''ని ఆ పార్టీ మాజీ నేత, టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. జగన్ కోసం కేసీఆర్ సర్వేలు చేయించాల్సిన పని ఏమిటని ప్రశ్నించారు. దీన్ని నీచమైన చర్యగా అభివర్ణించారు. శనివారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. "లంకలో (సీమాంధ్ర) పుట్టినోళ్లంతా రాక్షసులు'' అన్న కేసీఆర్ ఇప్పుడు రాక్షసులకు ఎందుకు వంత పాడుతున్నారని నిలదీశారు. ఇదంతా చూస్తుంటే టీఆర్ఎస్ ప్రచారానికి జగన్ ఏమైనా మెతుకులు పడేశాడా అన్న అనుమానం కలుగుతున్నదని వ్యాఖ్యానించారు. జగన్ దోపిడీలో టీఆర్ఎస్ వాటా ఎంతని ప్రశ్నించారు. "ఢిల్లీ అధిష్ఠానంతో టచ్‌లో ఉన్నట్లు బిల్డప్ ఇచ్చి... ఇక్కడ గెలవబోయే అభ్యర్థులను కాపాడుకునే ప్రయత్నంలో కేసీఆర్ ఉన్నారు. ఎంఐఎంను మభ్యపెట్టేందుకు యూపీఏకు మద్దతు అని మాట్లాడుతున్నారు. ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తుకు వెంపర్లాడారు. ఆ తర్వాత 'మాది సెక్యులర్ పార్టీ' అన్నారు, 'మూడో ఫ్రంట్‌కు మద్దతు..ప్రాంతీయ పార్టీలదే హవా' అని ప్రకటించారు. ఇప్పుడు మళ్లీ 'యూపీఏకు మద్దతు' అంటున్నారు. ఫలితాలు తరువాత కేసీఆర్ ఎవరి పక్షాన ఉంటారో ఆ దేవుడికి కూడా తెలియదు'' అని ఎద్దేవా చేశారు. చపలచిత్తానికి కేసీఆర్ మారుపేరన్నారు. 'సోనియాగాంధీకి కృతజ్ఞతలు' అంటున్న ఆయనకు ఆ పదానికి అర్థం తెలుసా అని ప్రశ్నించారు.
"అన్నం పెట్టిన చెయ్యికి సున్నం పెట్టి ఇప్పుడు కృతజ్ఞత అంటారా? పార్లమెంట్‌లో తెలంగాణ వ్యతిరేకులు ఎన్నో రకాల కుట్రలు చేసినా, ఆదిశక్తిలా నిలబడి సోనియా రాష్ట్రం ఇచ్చారు. అలాంటి తల్లిని బలి దేవత అన్నారు'' అని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఒకవైపు గౌరవిస్తూ..మరోవైపు టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యపై అవాకులు, చవాకులు మాట్లాడటం ఏమిటని మండిపడ్డారు. పార్టీలో చీలిక తెస్తే తెలంగాణ ప్రజలు చీరి చింతకు కడతరన్న కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. "గతంలో పార్టీ నుంచి చాలామంది బయటకు పోయారు. డబ్బులు తీసుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారు. వారందరిని ఎందుకు చీరి చింతకు కట్టలేదు? ఏళ్ల తరబడి ఉద్యమంలో పనిచేసిన వారికి కాదని, కొత్తగా వచ్చిన వారికి, తెలంగాణ ద్రోహులకు, తెలంగాణ వ్యతిరేకులకు రాత్రికి రాత్రి కండువాలు కప్పి టికెట్లు ఇచ్చిన వారిని ప్రజలు చీరి చింతకు కట్టరా? ఎల్బీనగర్‌లో రామ్మోహన్‌గౌడ్, జూబ్లీహిల్స్ మురళీగౌడ్, మల్కాజ్‌గిరి హన్మంతరావు, ముషీరాబాద్ ముఠా గోపాల్, వైరాలో చంద్రావతి, వరంగల్ కొండా సురేఖ, ఇబ్రహీంపట్నం చంద్రశేఖర్‌రెడ్డి ఇలా పార్టీకి సంబంధం లేని 55 మందికి టికెట్లు ఇచ్చినందుకు చీరి చింతకు కట్టరా? వారు పార్టీకి ఎలా వచ్చారో, టికెట్లు ఎలా తెచ్చుకున్నారో అందరికీ తెలుసు. గెలిచిన తర్వాత వారి దారి వారు చూసుకోకుండా ఉంటారా? అంటే..కేసీఆర్ చేస్తే సంసారం, వేరే వాళ్లు చేస్తే వ్యభిచారం'' అని ధ్వజమెత్తారు. దళిత సీఎం హామీ నుంచి పక్కకుపోతే ఆ వర్గాలు తిరుగుబాటు చేస్తాయని హెచ్చరించారు. "కాపలాకుక్కలాగా ఉంటానన్నావు. దళతులకు సీఎం పదవి ఇస్తానన్నావు. ఇప్పుడు నేనే సీఎం అంటున్నావు. 90 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉద్యమంలో పోరాడి సమిధలయ్యారు. ఇంతకాలం వారికి ఆశ చూపి ఇప్పుడు 'నేనే సీఎం' అంటే వాళ్లు మీపై తిరుగుబాటు చేయరా?'' అని నేరుగా ప్రశ్నించారు. అన్నారు. ముఖ్యమంత్రి విషయంలో ఎల్సీ సమావేశం నిర్ణయిస్తుందని కేసీఆర్ అనడంపై స్పందిస్తూ.. 'జోక్ ఆఫ్ ద డికేడ్' అని ఎద్దేవా చేశారు. సొంతంగా ప్రకటించుకునే ధైౖర్యం లేక వాళ్లతో, వీళ్లతో మాట్లాడి సీఎం కుర్చీని ఆక్రమించుకోవడం అనైతికం కాదా? అని ప్రశ్నించారు. గజ్వేల్‌లో కేసీఆర్ 50 వేల మెజారిటీతో గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, తక్కువ మెజారిటీ వస్తే కేసీఆర్ సన్యాసం తీసుకుంటారా అని మాజీ విప్ అనిల్ సవాల్ చేశారు. టీఆర్ఎస్‌ను చీల్చడం పెద్ద కష్టం కాదన్నారు.

No comments:

Post a Comment