Friday 20 November 2015

శభాష్‌.. శిద్దా!

శభాష్‌.. శిద్దా! 
Updated :20-11-2015 02:39:22
  • 24 గంటల్లో హైవేపై గండ్లు పూడ్చివేత 
  • అక్కడే కూర్చుని పనులు చేయించిన మంత్రి 
 
నెల్లూరు, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): ముంచెత్తిన వర్షం... హోరెత్తిన వరద... 40 మీటర్ల పొడవునా, సుమారు 15 అడుగుల లోతుకు కోసుకుపోయిన జాతీయ రహదారి! మూడు రోజులుగా నిలిచిపోయిన వేలాది వాహనాలు! 24 గంటల్లో మొత్తం ‘గండి’ పూడ్చివేత! ఇది... నెల్లూరు జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర రవాణా మంత్రి శిద్దా రాఘవరావు సాధించిన ఘనత. భారీ వర్షాలకు చెన్నై - కోల్‌కతా జాతీయ రహదారికి రెండు చోట్ల గండ్లు పడ్డాయి. అందులో... మనుబోలు వద్ద పడిన గండి చాలా పెద్దది. 24 గంటల్లో రెండుచోట్ల గండ్లు పూడ్చి వాహనాల రాకపోకలు పునరుద్ధరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ నేపథ్యంలో మంత్రి శిద్దా రాఘవరావు ఈ బాధ్యత తీసుకున్నారు. తన సొంత నియోజకవర్గమైన ప్రకాశం జిల్లా చీమకుర్తి నుంచి ఏకంగా 200 లారీలతో గ్రావెల్‌, మెటల్‌, రాళ్లను తెప్పించారు. బుధవారం సాయంత్రం పని మొదలైంది. గురువారం సాయంత్రానికి ముగిసింది. అప్పటిదాకా... శిద్దా అక్కడే ఉన్నారు. గురువారం సాయంత్రం ఆరు గంటకు తొలి వాహనంగా అంబులెన్స్‌ను రోడ్డు దాటించారు. ఈ క్రతువులో ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి కూడా తన వంతు సహకారం అందించారు. కృష్ణపట్నం పోర్టు వాహనాలను సమకూర్చింది.

No comments:

Post a Comment