Monday 31 October 2016

మీరు కొంచెం మారాలి బాబూ!

మీరు కొంచెం మారాలి బాబూ!
29-10-2016 23:36:39

సమీక్షకు సమయం ఆసన్నమయ్యింది. తెలుగునాట రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తి కావస్తోంది. ఆయా ప్రభుత్వాల పనితీరుపై ప్రజలు ఒక అంచనాకు రావడానికి ఈ సమయం సరిపోతుంది. మిగిలిన రెండున్నరేళ్లలో ఏమైనా చేయాలనుకున్నా ఏడాదిన్నర కాలమే ఉంటుంది. చివరి సంవత్సరంలో ఎన్నికల వాతావరణం ఏర్పడటమే కాకుండా అధికారంలో ఉన్నవారిపై ప్రజలు ఒక అభిప్రాయానికి కూడా వచ్చేస్తారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప చివరి సంవత్సరంలో పాలకులపై ప్రజల అభిప్రాయంలో మార్పురాదు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అన్నీ కలిసిరావడంతో ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పోల్చితే పాలనలో పైచేయిగా ప్రస్తుతానికి ఉన్నారు. అనాథగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో
పరిస్థితులను తట్టుకుని నిలదొక్కుకోవడానికి చంద్రబాబు నాయుడు అహరహం ప్రయత్నిస్తున్నా అక్కడి పరిస్థితులు ఆయనకు కలిసిరావడం లేదు. బహుశా ఈ కారణంగానే కాబోలు వీడీపీ అసోసియేట్స్‌ తాజాగా నిర్వహించిన సర్వేలో తెలంగాణ సీఎం దేశంలోనే ప్రథమస్థానంలో నిలవగా, ఏపీ సీఎం అయిదో స్థానం నుంచి ఏడో స్థానానికి పడిపోయారు. అధికారంలోకి వచ్చిననాటి నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్‌ పక్కా రాజకీయ వ్యూహంతో నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. ముందుగా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా శాసనసభలో తన బలాన్ని పెంచుకున్నారు. అదే సమయంలో ప్రజలను ఆకట్టుకోవడానికై మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ వంటి పథకాలతో పాటు పలు భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. పథకాలను ప్రారంభించిన కేసీఆర్‌ అంతటితో ఆగకుండా వాటికి భారీ ప్రచారం కల్పించడం ద్వారా తెలంగాణలో అద్భుతాలు జరగబోతున్నాయన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించారు. దీంతో తెలంగాణ ప్రజలలో ఆయన పాలనా సామర్థ్యంపై నమ్మకం ఏర్పడింది. నిజానికి చంద్రబాబులా కేసీఆర్‌ అంతగా శ్రమించడం లేదు. ఆడుతూపాడుతూ పాలన సాగిస్తున్నారు. అయితే, ప్రజలను తనవైపునకు తిప్పుకోవడానికి ఏమిచేయాలో ఆ పనిని సమర్థంగా చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విషయానికి వస్తే పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.

                  ప్రతిపాదిత అమరావతి నిర్మాణంపై అధిక ఫోకస్‌ చేయడం, చెబుతున్న మాటలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించకపోవడంతో ప్రజల్లో ముఖ్యమంత్రిపై నమ్మకం సన్నగిల్లుతోంది. కేసీఆర్‌ నిర్దేశించుకున్నట్టుగా చంద్రబాబు ప్రభుత్వం ప్రాధాన్యతలు నిర్దేశించుకోవడంలో విఫలమయ్యింది. అధికార యంత్రాంగంలో అలసత్వం, క్రమశిక్షణారాహిత్యం నెలకొనడంతో తలపెట్టిన పనుల్లో అంతగా పురోగతి కనబడటం లేదు. ప్రత్యేకహోదానా? ప్యాకేజీనా? అన్న మీమాంసతోనే ఏడాదికిపైగా గడిచిపోయింది. మధ్యలో కాపుల రిజర్వేషన్‌ ఆందోళన వంటి సమస్యలు చంద్రబాబు ప్రభుత్వానికి ప్రతిబంధకాలుగా తయారయ్యాయి. తెలంగాణ సీఎం కేసీఆర్‌ బహిరంగంగాగానీ, విలేకరుల సమావేశంలోగానీ ఎప్పుడో ఒకసారి మాత్రమే మాట్లాడతారు. దీంతో ఆయన ఎప్పుడైనా మాట్లాడితే ఏమి మాట్లాడతారా? అన్న ఆసక్తి ఉంటోంది. తరచుగా ప్రసంగాలు చేయకపోయినా, తనకు ఎటువంటి ప్రచారం కావాలో తెలిసిన కేసీఆర్‌ ఆ దిశగా ప్రతిరోజూ చర్యలు తీసుకుంటూ ఉంటారు. తెలంగాణలో మీడియా కూడా ఆయనకు పూర్తిగా సహకరిస్తున్నది కనుక కోరుకున్న ప్రచారం లభిస్తున్నది. చంద్రబాబు విషయానికి వస్తే, ఆయన రోజూ ఎక్కడో ఒకచోట ఏదో ఒక రూపంలో మాట్లాడుతున్నారు. దీంతో ఆయన ప్రసంగాలు రొటీన్‌ అయిపోయాయి. టీవీలలో చంద్రబాబు ప్రసంగిస్తుంటే ఆసక్తిగా వినే పరిస్థితిలో ఇప్పుడు ఏపీ ప్రజలు లేరు.

                  నిజానికి ఆయన గొప్ప ఉపన్యాసకుడు కూడా కాదు. ఆయన ప్రసంగాలు ప్రజలను ఆకట్టుకునేలా ఉండవు. అయితే, చంద్రబాబు పనితీరుపై నమ్మకంతోనే ప్రజలు ఆయనకు అధికారం అప్పగించారు. ఆయన ఉపన్యాసాలలో కొత్త విషయం ఏమీ ఉండదన్న అభిప్రాయం గతంలో కూడా ఉండేది. ఈ నేపథ్యంలో ఇద్దరు ముఖ్యమంత్రుల రెండున్నరేళ్ల పాలనను సింహావలోకనం చేసుకుంటే కొన్ని విజయాలు, మరికొన్ని వైఫల్యాలు కనిపిస్తాయి. అధికారంలోకి వచ్చిననాటి నుంచీ ఇద్దరు చంద్రులు అడ్డం - పొడవు ప్రకటనలు ఎన్నో చేశారు. ఆకాశానికి నిచ్చెనలు వేశారు. దీనివల్ల ప్రజల్లో అసంతృప్తి త్వరగా ఏర్పడే ప్రమాదం ఉందని గమనించిన కేసీఆర్‌ ఆ తరహా ప్రకటనలకు స్వస్తిచెప్పారు. చంద్రబాబు మాత్రం ఇంకా కొనసాగిస్తున్నారు. ఎవరి పద్ధతి వారిది కనుక ఫలానా వారిలా ఉండాలని సూచించడం సబబు కాదు. తెలంగాణలో కేసీఆర్‌ గత ఎన్నికలతో పోల్చితే బలం పెంచుకున్న విషయం వాస్తవం. అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికలే ఇందుకు నిదర్శనంకాగా, వివిధ సంస్థలు జరిపిన సర్వేలలో కూడా కేసీఆర్‌కు జనాదరణ పెరిగిందనే వెల్లడవుతోంది. చంద్రబాబు విషయంలో ప్రజల్లో ఆదరణ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి అక్కడ ఎన్నికలు జరగలేదు. ఏ సంస్థా సర్వేలు నిర్వహించలేదు. మరో రెండు మూడు నెలలలో మునిసిపాలిటీలకు జరగనున్న ఎన్నికల తర్వాతగానీ వాస్తవ పరిస్థితి ఎలా ఉందో తెలియదు. ప్రచారం విషయంలో కేసీఆర్‌తో పోల్చితే చంద్రబాబు బాగా వెనుకబడి ఉన్నారు. అదే సమయంలో చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడేవారి సంఖ్య కూడా అంతగా కనిపించడం లేదు. దీంతో చంద్రబాబుకు జనాదరణ తగ్గిందా? అన్న అనుమానం రాజకీయ పరిశీలకులలో ఏర్పడుతోంది. అయితే చంద్రబాబు ప్రభుత్వ పనితీరుపై పెదవి విరిచేవారు కూడా ప్రతిపక్షనాయకుడు జగన్మోహన్‌రెడ్డి వైపు మొగ్గుచూపడం లేదు. దీనినే గుడ్డికంటే మెల్ల నయం అంటారు కాబోలు. అయినా ఇప్పట్లో ఎన్నికలు రావు కనుక రెండున్నరేళ్ల తర్వాత జరిగే ఎన్నికలలో అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోవాలంటే ఇరువురు ముఖ్యమంత్రులు ముఖ్యంగా చంద్రబాబు కొన్ని దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి.

బాబు నేర్వని పాఠాలు..
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకోవలసిన దిద్దుబాటు చర్యలు చాలా ఉన్నాయి. అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రికి మధ్య అంతరం ఏర్పడింది. ఈ కారణంగా ముఖ్యమంత్రి వ్యవహారశైలి పట్ల పలువురు సీనియర్‌ అధికారులు విసుగు ప్రదర్శిస్తున్నారు. తరచుగా సుదీర్ఘ సమీక్షలు నిర్వహించడం, ప్రతిరోజూ ఉదయం ఎనిమిదిన్నర నుంచి గంటపాటు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహిస్తూ రావడంతో చంద్రబాబుపై అధికారులే బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. నిన్నమొన్నటి వరకు చాలామంది అధికారులు హైదరాబాద్‌లోనే ఉన్నందున సమీక్షలు, సమావేశాల కోసం ఎక్కే విమానం, దిగే విమానం అన్నట్టుగా వారి పరిస్థితి ఉండేది. ఇప్పుడు టెలీకాన్ఫరెన్స్‌ల వల్ల తలపోటు వస్తోందని ఒక సీనియర్‌ అధికారి వ్యాఖ్యానించారు. ఉదయంపూట అందరికీ ఇళ్లల్లో ఏవో పనులు ఉంటాయి. సరిగ్గా అటువంటి సమయంలో గంటపాటు టెలీకాన్ఫరెన్స్‌ ఉండటం వల్ల ఇబ్బందిగా ఉంటోందనీ, అయినా ముఖ్యమంత్రి ఇచ్చే ఆదేశాలు, చేసే సూచనలు అమలు కావాలంటే కనీసం పదిహేను రోజుల వ్యవధి అవసరమనీ, ఆ వ్యవధి ఇవ్వకుండా టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించడం వల్ల మొక్కుబడి తంతుగా మారిందనీ పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నారు. మంత్రులు, శాసన సభ్యులు కూడా ఈ టెలీకాన్ఫరెన్స్‌లో పాల్గొనవలసి ఉంటోంది. దీంతో తమను కలవడానికి ఉదయంపూట వచ్చే సందర్శకులను కలుసుకోలేకపోతున్నామని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా చేసేది ఏమీలేదు కనుక సెల్‌ఫోన్‌లు ఆన్‌లో ఉంచి ఎవరి పనుల్లో వారు ఉండిపోతున్నారు. టెలీకాన్ఫరెన్స్‌లో పాల్గొనలేకపోయిన అధికారులను సంబోధిస్తూ ముఖ్యమంత్రి కొన్ని సందర్భాలలో సూచనలు చేస్తూ ఉంటారు. మొత్తంమీద ఈ టెలీకాన్ఫరెన్స్‌ల వ్యవహారం చంద్రబాబుకు లాభించకపోగా, నష్టం చేస్తోందన్న అభిప్రాయమే అటు తెలుగుదేశం పార్టీ వర్గాలలో, ఇటు అధికార వర్గాలలో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పరిస్థితిని సమీక్షించుకుని, ప్రభుత్వ ప్రాధాన్యతలను ముందుగా నిర్దేశించుకుని, వాటి అమలు బాధ్యతను ఎంపిక చేసిన అధికారులకు అప్పగించి, పక్షంరోజులకు ఒకసారి ముఖాముఖి మాట్లాడటం మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజానికి, తెలంగాణతో పోల్చితే ఏపీలో కొన్ని వ్యవహారాలు సాఫీగా సాగిపోతున్నాయి. అయినా వాటికి తగిన ప్రచారం లభించడం లేదు. ఉదాహరణకు తెలంగాణలో విద్యార్థుల ఫీజులు చెల్లించాలంటూ ఆందోళనలు చేస్తూ ఉండటాన్ని చూస్తున్నాం. ఆరోగ్యశ్రీ బకాయిల విడుదల కోసం ప్రయివేటు ఆసుపత్రుల యాజమాన్యాలు కూడా అప్పుడప్పుడు ఆందోళన చేస్తున్నాయి. ఏపీలో ఈ పరిస్థితి లేదు.

                  ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ విద్యార్థులకు ఫీజులు, ఎన్టీఆర్‌ ఆరోగ్య బీమా పథకం కింద టంచన్‌గా చెల్లింపులు జరుగుతున్నాయి. అలాగే జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద కేంద్రం నుంచి గరిష్ఠంగా నిధులు పొందుతూ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇలాంటివి హైలైట్‌ కావడం లేదు. అదే సమయంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల అనవసర విమర్శలు ఎదుర్కోవలసి వస్తోంది. ఉదాహరణకు, రాజధాని నిర్మాణం కోసం చేపట్టిన స్విస్‌ ఛాలెంజ్‌ విధానాన్నే తీసుకుందాం! ఈ అంశంపై హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రజలు శంకించే పరిస్థితిని కొనితెచ్చుకున్నారు. స్విస్‌ చాలెంజ్‌లో పాల్గొనే బిడ్డర్లు ఇవ్వజూపిన రెవెన్యూ వాటాను ఇతర బిడ్డర్లకు కూడా తెలియ చేయాలని చట్టంలో పేర్కొన్నారు. ఇక్కడ అధికారులు వాడిన ఒక పొరపాటు పదం వల్ల ప్రభుత్వం ఆత్మరక్షణలో పడవలసి వచ్చింది. అంతేకాకుండా మొత్తం ప్రాసెస్‌ మూడు నెలలు జాప్యం అవుతోంది. ఆసక్తి ఉన్న సంస్థలకు రెవెన్యూ వాటా వివరాలు తెలియ చేయాలని మొదట చట్టంలో పేర్కొన్నారు. ‘ఆసక్తి అంటే’... అర్హత ఉన్నవారే ఆసక్తి చూపుతారన్న ఉద్దేశంతో ఆ పదం చేర్చామని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ పదాన్ని ఉపయోగించుకుని అర్హత లేనివారు కూడా తమకు ఆసక్తి ఉందంటూ ముందుకు వచ్చి, పోటీలో తొలుత పాల్గొన్న బిడ్డర్లు ఇవ్వజూపిన రెవెన్యూ వాటా వివరాలు కావాలని కోరారు. చివరకు వివాదం కోర్టుకు చేరింది. దీంతో తప్పు తెలుసుకున్న అధికారులు చట్టానికి స్వల్ప సవరణ చేస్తూ ‘ఆసక్తి ఉన్న’ అన్న పదం బదులు ‘అర్హత ఉన్న ఇతరులకు’ అని చేర్చడంతో వివాదం ముగిసింది. ఇంతాచేస్తే ఈ స్విస్‌ చాలెంజ్‌లో పాల్గొన్న తొలి బిడ్డర్లు రెండూ సింగపూర్‌ కంపెనీలే కావడం విశేషం. ఈ రెండు కంపెనీలలో ఒకటి పూర్తిగా సింగపూర్‌ ప్రభుత్వానిది కాగా, రెండవ దాంట్లో సింగపూర్‌ ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉంది. సింగపూర్‌ ప్రభుత్వంలో అవినీతి జీరో శాతం అని అందరూ అంగీకరించే విషయమే! ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ సంస్థ కూడా ఆ మేరకు సింగపూర్‌ ప్రభుత్వాన్ని గుర్తించింది. వాస్తవం ఇది కాగా, సింగపూర్‌కు చెందిన ప్రయివేటు కంపెనీలకు రాజధాని భూములను కట్టబెడుతున్నారన్న అపవాదును ప్రభుత్వం మూటగట్టుకోవలసి వచ్చింది. ఇది స్వయంకృతాపరాధమే! రియల్‌ ఎస్టేట్‌ డెవల్‌పమెంట్‌ వేరు- రాజధాని డెవల్‌పమెంట్‌ వేరు అని కూడా ప్రభుత్వం చెప్పుకోలేకపోయింది.

                  రాజధానికి పెట్టుబడులు రావాలంటే రియల్‌ ఎస్టేట్‌ సంస్థల వల్ల జరగదు. అంతర్జాతీయంగా పేరు ప్రతిష్ఠలు ఉండి పెట్టుబడిదారులలో నమ్మకం కలిగించవలసిన సంస్థలకే అది సాధ్యం. ఈ విషయం అలా ఉంచితే, అధికారంలోకి వచ్చిన తర్వాత చాలాకాలంపాటు తెలుగుదేశం పార్టీ వ్యవహారాలను చంద్రబాబు గాలికి వదిలేశారు. ఒక్కరోజు కూడా పార్టీ కార్యాలయానికి వెళ్లలేదు. దీంతో పార్టీకీ ఆయనకూ మధ్య అంతరం పెరిగింది. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా అనధికార పదవుల భర్తీ పూర్తిగా జరగలేదు. ఫలితంగా పార్టీ యంత్రాంగంలో నిరాశా నిస్పృహలు చోటుచేసుకున్నాయి. పాలనా వ్యవహారాలకే పరిమితమై రాజకీయ వ్యవహారాలను పట్టించుకోకపోవడం చంద్రబాబుకు నష్టం చేసింది. ప్రజాప్రతినిధుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవడానికి కూడా ముఖ్యమంత్రి సుముఖత చూపడం లేదన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. దీంతో క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను చెప్పడానికి మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకు అందరూ వెనుకాడుతున్నారు. ఇక్కడ ఒక విషయం ప్రస్తావించవలసి ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కాపులకు ఏటా వెయ్యికోట్ల రూపాయల రుణాలను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించుకున్నారు. రుణాల పంపిణీ కూడా మొదలయ్యింది. అయితే రుణాలు పొందినవారు ఆటోలు వగైరా కొనుక్కుని వాటిపై చంద్రబాబు ఫోటో కూడా ప్రదర్శించడం లేదనీ, పవన్‌కల్యాణ్‌ లేదా ముద్రగడ పద్మనాభం ఫొటోలు పెట్టుకుంటున్నారని గోదావరి జిల్లాలకు చెందిన ఒక ఎమ్మెల్యే చెప్పారు. చేస్తున్న పనికి రాజకీయ ప్రయోజనం పొందడంపై చంద్రబాబు దృష్టి కేంద్రీకరించకపోవడం వల్లనే ఇలా జరుగుతోందని ఆ ఎమ్మెల్యే విశ్లేషించారు. కాపులను సంతృప్తిపరిచే క్రమంలో బీసీలలో పార్టీపట్ల వ్యతిరేకత ఏర్పడే ప్రమాదం ఉందనీ, ఇప్పటికే ఈ ఛాయలు కనిపిస్తున్నాయని మరో ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. బీసీలు అధికంగా ఉండే గ్రామాలలో కూడా కాపులు తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ ఎక్కువమందికి రుణాలు మంజూరు చేస్తున్నారనీ, బీసీలు అధికంగా ఉన్నా తక్కువ సంఖ్యలో రుణాలు ఇస్తున్నారనీ, దీనిపై బీసీలు ఆగ్రహంగా ఉన్నారని ఆ ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి అవకాశం ఇస్తే ఇవన్నీ ఆయన వద్ద చెప్పుకోవాలని తమకు ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతిపాదించిన మెగా ఆక్వాపార్క్‌ వివాదాస్పదం కావడం కూడా స్వయంకృతాపరాధమేనని చెప్పాలి. అధికార యంత్రాంగంతోపాటు పార్టీ యంత్రాంగంలో నిర్లిప్తత లేదా నిర్లక్ష్యం వల్ల గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకున్నట్టు అయ్యింది.

                  టెక్నాలజీ విషయంలో కూడా ముఖ్యమంత్రి తన వైఖరిని సమీక్షించుకోవలసిన అవసరం ఉంది. సర్వరోగ నివారణి జిందా తిలస్మాత్‌ అన్నట్టుగా అన్నిచోట్లా టెక్నాలజీ గురించే చెప్పడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఉమ్మడి రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఎక్కువగా ఐటీ జపం చేసేవారు. గ్రామాలు, లంబాడి తండాలకు వెళ్లినప్పుడు అక్కడ వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఏంచేసేదీ చెప్పకుండా, అప్పట్లో ఓ వెలుగు వెలుగుతూ ఉన్న సత్యం కంప్యూటర్స్‌ అధినేత రామలింగరాజువలె మీరు కూడా డబ్బు సంపాదించుకునే ఆలోచనలు చేయాలని చెప్పేవారు. దీంతో గ్రామీణులకు అప్పట్లో దూరం అయ్యారు. ఇప్పుడు మళ్లీ ఆ పరిస్థితి రాకుండా ముఖ్యమంత్రి తన వైఖరిని సమీక్షించుకోవాలి. ఇటువంటి లోపాలు మరెన్నో ఉన్నప్పటికీ, ఇప్పుడున్న పరిస్థితులలో ఏపీని నిలబెట్టగలిగేది చంద్రబాబు ఒక్కరేనన్న అభిప్రాయం ఇప్పటికీ చాలామందిలో ఉంది. అయితే 1995-1999 మధ్యకాలంలోవలె చంద్రబాబు తరఫున వకాల్తా పుచ్చుకుని ఆయన పనితీరును బహిరంగంగా శ్లాఘించేవారు ఇప్పుడు కరువయ్యారు. తెలంగాణ ప్రజలతో పోల్చితే ఏపీ ప్రజల ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. వారిని సంతృప్తిపర్చడం అంత తేలిక కాదు. అదే సమయంలో, ఆ సమాజం కులమతాల ప్రాతిపదికన విడిపోయి ఉంది. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎదురుకాని ఎన్నో సమస్యలు చంద్రబాబు ముందున్నాయి. అక్కడ ప్రతిపక్షం కూడా బలంగా ఉంది. ఈ నేపథ్యంలో తనకున్న పరిమితులను దృష్టిలో పెట్టుకుని లక్ష్యాలను నిర్దేశించుకోవలసిన అవసరం చంద్రబాబుకు ఎంతైనా ఉంది. ఆకాశానికి నిచ్చెనలు వేయడం మానుకోవాలి. మిగిలిన రెండున్నరేళ్లలో ఎంత చేయగలరో, ఏమిచేయగలరో అంతే చెప్పడం మంచిది.

                  ప్రపంచంలోకెల్లా అద్భుతమైన రాజధానిని నిర్మించాలని అక్కడి ప్రజలు ఇప్పుడు కోరుకోవడం లేదు. సౌకర్యవంతమైన రాజధాని నిర్మాణం జరిగితే చాలని మాత్రమే కోరుకుంటున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా పోలవరం నిర్మాణం వేగంగా సాగాలి. ప్రస్తుత కాంట్రాక్టర్‌ వల్ల అది సాధ్యంకాదన్న అభిప్రాయం విస్తృతంగా ఉన్నందున ప్రత్యామ్నాయ కాంట్రాక్టర్‌కు బాధ్యతలు అప్పగించడం మంచిది. ప్రభుత్వం పట్ల ప్రజలలో ఫీల్‌గుడ్‌ భావన పెంపొందించడానికి రాజకీయంగా ఆలోచించి చర్యలు తీసుకోవాలి. అంతా నాకు తెలుసు అని కాకుండా, మీకు తెలిసింది కూడా చెప్పండి అని చెప్పుకునే అవకాశం కల్పిస్తే దానివల్ల ప్రయోజనం పొందేది ముఖ్యమంత్రే!

 కేసీఆర్‌కు భావి సవాళ్లు
ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విషయానికి వద్దాం! ప్రస్తుతానికి తెలంగాణలో ఆయనకు తిరుగులేదు. ఆయనను ఎదుర్కోగల ప్రతిపక్ష నాయకుడు కూడా లేడు. అయితే, రాజకీయాలలో ఇప్పుడున్నట్టు రేపు ఉండదు. వచ్చే ఎన్నికల వరకు ఇదే పరిస్థితి కొనసాగాలంటే కేసీఆర్‌ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరు నెలల క్రితంవరకు కేసీఆర్‌ భారీ ప్రకటనలు చేస్తూ ఉండేవారు. ఇప్పుడు వాటి ఊసే లేకుండాపోయింది. ప్రభుత్వ ఆదాయం పెరుగుతున్నప్పటికీ పలు పథకాలను ఒకేసారి భారీగా చేపట్టడం వల్ల నిధుల కొరత ఏర్పడుతోంది. తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఇప్పుడు అంత సాఫీగా లేదు. దీంతో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం వంటి సమస్యలు కేసీఆర్‌ను చుట్టుముట్టడానికి కాచుకుని ఉన్నాయి. మాటలకు చేతలకు పొంతన లేనప్పుడు ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతుంటుంది. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పథకంపై పేదలు గంపెడాశలు పెట్టుకుని ఉన్నారు. వచ్చే ఎన్నికలనాటికి ఈ పథకాన్ని అమలుచేయడం మొదలు పెట్టకపోతే రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. మిషన్‌ భగీరథ వంటి పథకాలు ప్రస్తుతానికి ఆకర్షణీయంగా కనిపిస్తున్నప్పటికీ మున్ముందు వాటివల్ల ఓట్లు రావు. ఈ పథకం కింద సరఫరా చేసే నీటికి బిల్లులు చెల్లించవలసి ఉంటుంది. దీనివల్ల గ్రామీణులలో వ్యతిరేకత ఏర్పడే ప్రమాదం ఉంది. ఇబ్బడిముబ్బడిగా జిల్లాలు పెంచడం వల్ల ప్రజల్లో సానుకూలత ఏర్పడి ఉండవచ్చుగానీ ప్రభుత్వ వ్యయం కూడా పెరుగుతుంది. 1680 కోట్ల రూపాయల వ్యయంతో కొత్త జిల్లాలలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయాలు నిర్మించాలనుకోవడం ఇప్పుడున్న పరిస్థితులలో వాంఛనీయం కాదు. నిధుల కొరత వల్ల డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాన్ని మొదలుపెట్టలేని స్థితిలో... ప్రభుత్వ భవనాలకు ఇప్పుడు అంత డబ్బు అవసరమా? అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. ఇప్పుడున్న సచివాలయాన్ని కూలగొట్టి నూతన భవన సముదాయాన్ని నిర్మించాలన్న నిర్ణయంపై ఒకరు స్పందిస్తూ, ఆ డబ్బుతో పేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కట్టవచ్చుగా సార్‌? అని ప్రశ్నించారు.

                  హైదరాబాద్‌లో పౌర సౌకర్యాలు అధ్వాన్న స్థితికి చేరుకున్నాయి. ఆయా సంస్థల సర్వేలలో కూడా జిల్లాలతో పోల్చితే హైదరాబాద్‌లో ప్రభుత్వం పట్ల ఆదరణ తక్కువగా ఉంది. అయితే, రాజకీయ వ్యూహరచనలో ప్రస్తుతానికి కేసీఆర్‌ను మించినవారు తెలంగాణలో ఎవరూ లేరు కనుక ప్రకటిత పథకాలు అమలుకు నోచుకోకపోయినా ప్రజలను తనవైపునకు తిప్పుకోవడం ఎలాగో ఆయనకు బాగా తెలుసు. అయితే అన్ని రోజులు ఒకేలా ఉండవన్న సూత్రం కేసీఆర్‌కు తెలియంది కాదు.
యూట్యూబ్‌లో ‘కొత్త పలుకు’ కోసం
http://www.youtube.com/abntelugutv

No comments:

Post a Comment