Sunday 2 October 2016

నిలిచిన ఆరోగ్య శ్రీ వైద్య సేవలు

నిలిచిన ఆరోగ్య శ్రీ వైద్య సేవలు
03-10-2016 02:29:54
ప్రభుత్వంతో ప్రైవేటు ఆస్పత్రుల చర్చలు విఫలం
హైదరాబాద్‌, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిచిపోయాయి. ప్రభుత్వంతో ప్రైవేట్‌ ఆసుపత్రుల ప్రతినిధులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో వైద్య సేవలకు దూరంగా ఉండాలని ప్రైవేట్‌ ఆసుపత్రులు నిర్ణయించాయి. శనివారం రాత్రి నుంచి వైద్య సేవలకు దూరంగా ఉన్నట్టు ప్రైవేట్‌ ఆసుపత్రుల అసోసియేషన ప్రకటించింది. ఆరోగ్యశ్రీ వైద్య సేవలకు సంబంధించి ప్రైవేట్‌ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బిల్లులు బకాయి ఉన్న విషయం తెలిసిందే. ఈ బిల్లులను చెల్లిస్తేనే.. వైద్య సేవలను కొనసాగిస్తామని ప్రైవేట్‌ ఆసుపత్రులు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై చర్చించడానికి శనివారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రైవేట్‌ ఆసుపత్రుల అసోసియేషన ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపినా ఫలించలేదు. పెండింగ్‌ బిల్లుల విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతో సమ్మెకు వెళ్లాలని ప్రైవేట్‌ ఆసుపత్రులు నిర్ణయించాయి. ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్‌లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 260 ఆసుపత్రులు ఉండగా.. సుమారు రూ. 430 కోట్ల బిల్లులు బకాయిలు ఉన్నట్టు ప్రైవేట్‌ ఆసుపత్రుల ప్రతినిధులు తెలిపారు. అవి విడుదల చేస్తేనే వైద్య సేవలను కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.

No comments:

Post a Comment