Sunday 16 March 2014

నరేంద్ర మోదీ ప్రభువు పంపిన రక్షకుడు - Venkaiah

నరేంద్ర మోదీ ప్రభువు పంపిన రక్షకుడు

Published at: 17-03-2014 02:47 AM
ప్రజలు అలాటే చూస్తున్నారు
ఏపీలో కరెంటు రాదు..గుజరాత్‌లో పోదు
12 ఏళ్లలో అక్కడ మత కలహమే లేదు
బీజేపీకి..సహకరించే పార్టీలకే ఓటేయండి
కాంగ్రెస్ పాపాల్లో తృతీయ ఫ్రంట్‌కూ భాగం
ఫెడరల్ ఫ్రంట్‌లోని అక్కలంతా ప్రధానులే
'మోదీ ఫర్ సీఎం'లో వెంకయ్య ఎద్దేవా
హైదరాబాద్, మార్చి 16 : యూపీఏ ప్రభుత్వం ఎంత తొందరగా పోతే అంత మంచిదని ప్రజలు చూస్తున్నారని, ప్రభువు పంపిన రక్షకుడిగా నరేంద్రమోదీ వారికి కనిపిస్తున్నారని బీజేపీ సీనియర్ నేత ఎం వెంకయ్యనాయుడు అన్నారు. "కొందరు తమకు ఓటు వేస్తే, తాము తర్వాత మోదీకి వేస్తాం అంటున్నారు. ఇది ముక్కు ఎక్కడ అంటే చుట్టు తిప్పి చూపినట్లుగా ఉంది. అలా కాకుండా బీజేపీకి, దానికి సహకరించే పార్టీలకే ఓటు వేసి సహకరించండి'' అని విజ్ఞప్తి చేశారు. దేశంలో మంచి ప్రధాని, రెండు రాష్ట్రాల్లో మంచి ముఖ్యమంత్రులు రావాలన్నారు. ఆదివారంనాడిక్కడ జరిగిన 'మోదీ ఫర్ పీఎం' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. "బీజేపీలో కొత్త తరానికి సహజంగానే అవకాశాలు లభిస్తాయి. పల్లెటూరిలో వీధిబడిలో చదువుకున్న నన్ను ఎన్నడూ ఊహించని స్థాయిలో పార్టీ జాతీయ అధ్యక్ష పదవిలోకి తీసుకున్నారు. సామాన్య కుటుంబంలో పుట్టిన మోదీ అంచెలంచలుగా ఎదిగారు. ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే ఇదే''న్నారు. భారత దేశానికి మోదీనే ఆశాకిరణమన్నారు. "ప్రస్తుతం దేశంలో ఉద్యోగాలు ఊడుతున్నాయి. ఈఎంఐలూ కట్టలేని స్థితిలో ఉద్యోగులున్నారు. పెట్టుబడులు విదేశాలకు తరలుతున్నాయి. యువత అసహనంతో ఉంది. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మహిళలపై దాడులు జరుగుతున్నాయి. శ్రీలంకలో తమిళులను ఊచకోత కోస్తే స్పందన లేదు. పాకిస్థాన్ మన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది. ఈ స్థితిలో తమ రక్షకుడిగా మోదీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు'' అని పేర్కొన్నారు.
స్థిర ప్రభుత్వం, సమర్థ నాయకత్వం అందిస్తాం
దేశానికి స్థిర ప్రభుత్వం, సమర్థ నాయకత్వం కావాలన్నారు. "బీజేపీకి మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఏపీలో కరెంటే రాదు. గుజరాత్‌లో కరెంటే పోదు. అక్కడ క్వాలిటీ పవర్ ఉంది. రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు ఇచ్చారు. పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉంది. సోలార్ పవర్‌లో నంబర్ వన్‌గా ఉంది. గోవాలో లీటరు పెట్రోలు అన్ని రాష్ట్రాల్లోకంటే రూ.10 తక్కువకు ఇస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోనూ మంచి ట్రాక్ రికార్డుంది. హైదరాబాద్, ముంబైలలో అంతర్జాతీయ విమానాశ్రయాల ఏర్పాటు..వాజ్‌పేయి ఇచ్చిన బహుమతులు'' అని చెప్పుకొచ్చారు. ప్రజలకు తాయిలాలు ఇవ్వడం కాదని, చేపలు పట్టేవిధానం నేర్పాలన్నారు. "కొంతమంది బీజేపీ అధికారంలోకి రాదంటూ కొన్ని లెక్కలు చెబుతున్నారు. చంద్రబాబు-జగన్ కలుస్తారా? టీఆర్ఎస్-టీడీపీ కలుస్తాయా? సీపీఎం-తృణమూల్ కాంగ్రెస్‌లు కలుస్తాయా?.. బీజేపీ అధికారంలోకి వస్తుండడాన్ని జీర్ణించుకోలేనివారు అటువంటి లెక్కలు చెబుతున్నారు'' అని విమర్శించారు. మూడో ఫ్రంట్ ఒక ఎండమావి, మృగ మరీచిక అని దుయ్యబట్టారు. " దేవెగౌడ, గుజ్రాల్, చంద్రశేఖర్ ప్రభుత్వాలను చూశాము. అవి మూడు నాళ్ల ముచ్చటగానే ముగిశాయి. అమ్మలంతా కలిసి నాలుగో ఫ్రంటు అంటున్నారు. మొత్తం ఏడుగురు ప్రధానులు కావాలంటున్నారు. వారంలో రొటేషన్ పద్ధతిలో ఏడుగురు ప్రధానులూ ఉంటారా?'' అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాపాల్లో మూడో ఫ్రంట్‌లోని పార్టీలూ భాగస్వాములేనన్నారు. " సీపీఐ నారాయణ, సీపీఎం రాఘవులు ఒకటికా రు. కానీ.. ప్రపంచ కార్మికులు ఏకం కావాలంటూ పిలుపునిస్తారు. ఒక పార్టీ టీఆర్ఎస్‌తో పోతుంటే.. మరో పార్టీ వైసీపీతో పోతోంద''ని ఎద్దేవా చేశారు. ఉత్తరప్రదేశ్ ప్రజలు మోదీని కావాలని కోరుకున్నారని, అంతేకానీ ఆయన వారణాసిని కోరుకోలేదన్నారు.
ఇదేమైనా జై పాతాళభైరవా!
గత 12 సంవత్సరాల నుంచి గుజరాత్‌లో ఒక్క మతకలహం జరగలేదన్నారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో ఈ మధ్యకాలంలో చాలానే మత ఘర్షణలు చోటుచేసుకున్నాయని గుర్తు చేశారు. "గుజరాత్‌లో 2002లో రెండు రోజులపాటు జరిగింది దురదృష్టకరం. హిందువులూ ముస్లింలూ చనిపోయారు. మరి 1984లో ఢిల్లీలో జరిగిందేమిటి? దేశంలో జరిగే సంఘటనలకు ఎంతమంది రాజీనామా చేశార''ని ప్రశ్నించారు. సీపీఎం మినహా అన్ని పార్టీలూ రాష్ట్ర విభజనకు అనుకూలంగా మాట్లాడాయన్నారు. రెండు రాష్ట్రాలనూ కలుపుతామంటూ ఓ పార్టీ చెబుతోందని, ఇదేమైనా జై పాతాళభైరవా అని ఎద్దేవా చేశారు. "నీతికి, న్యాయానికి కట్టుబడిన పార్టీనుంచి వచ్చాను. ఎమర్జెన్సీలో జైలుకు వెళ్లినా వెనక్కు తగ్గలేదు. అసెంబ్లీలోనూ భయపడలేదు. రకరకాల తప్పుడు ప్రచారాలు చేశారు. సీమాంధ్రగురించి మాట్లాడడం తప్పా? ఇది భారత దేశంలోది కాదా? జాగో, భాగో అని కొందరు నాయకులు భయాలు రేపారు. వాటిని తొలగించేందుకు సవరణలకోసం పట్టుపట్టాను. సీమాంధ్రలో రెవెన్యూ లోటు ఉంటే ఎవరూ పట్టించుకోలేదు. పార్లమెంటులో హామీలు వస్తే అవి బైండింగ్‌గా ఉంటాయనే పట్టుపట్టాను. ఆ ప్రాంతానికి న్యాయం జరిగేందుకు వ్యక్తిత్వాన్ని ఫణంగా పెట్టి మాట్లాడాను.
ఇరు ప్రాంతాల సమస్యలను తీసుకుని కొంతవరకు న్యాయం చేసేందుకు ప్రయత్నించాను'' అని చెప్పారు. తనను, మరికొందరు నేతలకు మానవబాంబు ప్రమాదం ఉందంటూ ఐజీ ఒకరు హెచ్చరించినట్లు వెల్లడించారు. తానుగానీ, తన కుమార్తె కానీ ఎన్నికల్లో పోటీ చేయబోవడంలేదని స్పష్టం చేశారు. హైదరాబాద్..ఇక్కడ నివసిస్తున్నవారందరికీ చెందుతుందని, వారి హక్కుల కోసం బీజేపీ నిలబడుతుందన్నారు. ప్రభుత్వం, కేబినెట్ లేకుండా ప్రజలు జీవించగలరని కాంగ్రెస్ రుజువు చేసిందని బీజేపీ ఆంధ్రా కమిటీ అధ్యక్షుడు హరిబాబు అన్నారు. "హైదరాబాద్‌లో శాంతి భద్రతల సమస్యలు రావు. మజ్లిస్‌తో సమస్య వస్తే అడ్డుకుంటాం'' అని బీజేపీ తెలంగాణ కమిటీ కిషన్‌రెడ్డి చెప్పారు. కాగా, "స్వాతంత్య్రం సిద్ధించి 2022 నాటికి 75 సంవత్సరాలు పూర్తవుతుంది. దీనికి ఎనిమిదేళ్ల సమయం ఉంది. ఆ బెంచ్ మార్కులో సమగ్రాభివృద్ధి సాధించడమే మోదీ లక్ష్యం'' అని బీజేపీ ఎంపీ పీయూష్ గోయల్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ, జాతీయ నేత ప్రకాశ్ జవదేకర్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment