Friday 10 June 2016

తెలంగాణ ఇచ్చామిలా!

తెలంగాణ ఇచ్చామిలా! 
11-06-2016 01:20:38

  • ‘రాయల్‌ తెలంగాణ’పై కసరత్తు జరిగింది
  • మున్ముందు గొడవ ఆపేందుకే ‘టీ’కి హైదరాబాద్‌
  • ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌ యోచన నాదే
  • 1950 నుంచే ఇక్కడ సీమాంధ్రుల పెట్టుబడులు
  • నాటి విశేషాలతో జైరామ్‌ రమేశ్‌ పుస్తకం
  • ఉమ్మడి గవర్నర్‌ను నియమించాలన్న యోచన కూడా నాదే
  • 1950ల నుంచే తెలంగాణలో సీమాంధ్రుల పెట్టుబడులు
  • బాబు హయాంలో అభివృద్ధి.. పుస్తకంలో ఆసక్తికర అంశాలు
హైదరాబాద్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): జైరామ్‌ రమేశ్‌... విభజనకు ముందు తెలుగు రాష్ట్రాల మీడియాలో నిత్యం వినిపించిన పేరు! కనిపించిన రూపం! విభజన ప్రక్రియలో, ఆ చట్టం రూప కల్పనలో, తెరముందు ప్రకటనలు, తెరవెనుక మంతనాల్లో... అన్నింటా ఆయనదే కీలక పాత్ర! ఆనాటి ముచ్చట్లపై ఆయనే నోరు విప్పితే! కలం కదిలిస్తే! ఆసక్తికర అంశాలు వెలుగుచూడటం తథ్యం! జైరామ్‌ రమేశ్‌ ఆ పనే చేశారు. ‘ఓల్డ్‌ హిస్టరీ-న్యూ బయోగ్రఫీ’ (పాత సంగతులు-కొత్త సరిహద్దులు) పేరిట రాష్ట్ర విభజనపై పుస్తకం రచించారు. ఇందులో తొలి 42 పేజీలు పరిచయం, పాత చరిత్ర ఉంది. అటుపైన 2009 నవంబర్‌ 9న కేసీఆర్‌ ఆమరణ నిరశన ప్రారంభం... తెలంగాణ రగుల్కొనడంతో రెండో అధ్యా యం మొదలు... పది జిల్లాల తెలంగాణ పది రోజులు భగ్గుమన్న తర్వాత... డిసెంబర్‌ 9న రాత్రి 11:30గంటలకు చిదంబరం చేసిన ప్రకటన గురించి జైరామ్‌ వివరించారు.
 
‘ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేసిన ఆ పది రోజులు’ పేరిట ఆ తర్వాత చెలరేగిన సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ప్రస్తావించారు. ‘డిసెంబర్‌ 9’నుంచి వెనక్కి వెళ్లేందుకు దారితీసిన పరిస్థితులు వివరించా రు. ‘‘సీమాంధ్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేశారు. విదర్భ, గూర్ఖాలాండ్‌, బోడోలాండ్‌, మారుప్రదేశ్‌ డిమాండ్లు ఊపందుకున్నాయి. తమిళనాడు నేత ఎస్‌.రాందాస్‌ తమ రాష్ట్రాన్నీ విభజించాలన్నారు. ఉత్తరప్రదేశ్‌ను నాలుగుగా విభజించాలని సీఎం రెండుసార్లు లేఖలు రాశారు. మరోవైపు... డిసెంబర్‌ 9 ప్రకటన దిగ్ర్భాంతి పరిచిందని అప్పటి ఏపీ సీఎం రోశయ్య వ్యాఖ్యానించారు’’ అని వివరించారు.
 
ఏపీలోని 8 పార్టీలతో చిదంబరం సంప్రదింపులు, ఇతర అంశాలు వివరిస్తూ... ‘మారిన పరిస్థితుల నేపథ్యంలో’ మరింత విస్తృత సంప్రదింపులు అవసరమని ప్రకటించినట్లు తెలిపారు. ఆ తర్వాత జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీని నియమించడం, అది ఆరు మార్గాంతరాలను సూచించడాన్ని వివరించా రు. ‘‘తెలంగాణలో ‘2011-12 మధ్య అనేకమంది ఆత్మహత్య చేసుకున్నారు. అనేక సంస్థలు, ముఖ్యంగా జేఏసీ రకరకాల రూపాల్లో ఉద్యమాలు లేవనెత్తింది. 2011 మార్చి 10న ట్యాంక్‌బండ్‌పైన తెలుగుకు కీర్తి చిహ్నాలైన శ్రీకృష్ణ దేవరాయ, అన్నమాచార్య, సర్‌ ఆర్థర్‌ కాటన్‌వంటివారి విగ్రహాలను ధ్వంసం చేశారు. జూలైలో మంత్రివర్గం నుంచి తెలంగాణ నేతలంతా రాజీనామా చేశారు. ఇవన్నీ కాంగ్రెస్‌ అధిష్ఠానంపై ఒత్తిడి పెంచాయి. మరోవైపు రాష్ట్రవిభజనకు అనుకూలంగా బీజేపీ, టీడీపీ, వైసీపీ లేఖలు ఇచ్చాయి. దీంతో కాంగ్రె్‌సకూ బలం వచ్చింది’’ అని జైరామ్‌ తెలిపారు. మరిన్ని కీలకాంశాలు ఆయన మాటల్లోనే...

ఉపసంఘంలో పాత్ర 
విభజనపై మంత్రివర్గ ఉపసంఘం వేద్దామన్న నా సూచనకు సమ్మతి లభించింది. కేబినెట్‌ కార్యదర్శి దీని విధివిధానాలు వివరిస్తూ నోట్‌ జారీచేశారు. కానీ.. అత్యంత ఆశ్చర్యం కలిగించినదేమిటంటే, తెలంగాణ ఏర్పాటుకు కేబినెట్‌లో సానుకూల చట్టాల రూపకల్పన కోరుతూ హోంశాఖద్వారా ఉపసంఘానికి సూచన వచ్చింది. ఉపసంఘాన్ని వేయగానే విద్య, నదీజలాలపై స్పష్టత ఇవ్వాలని, లేకపోతే సమస్యలు తప్పవని నిక్కచ్చిగా చె ప్పాను. ‘‘విభజనపై ప్రజల మనోగతం తెలుసుకుని, రంగంలోకి దిగుదాం. ఇందుకోసం వెబ్‌సైట్‌ ప్రారంభించి అభిప్రాయసేకరణ చేద్దాం’’ అని నాటి హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండేకు చెప్పగా స్వాగతించారు.
 
కిరణ్‌ ససేమిరా అన్నారు 
సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించా రు. ఇది ఆశ్చర్యం కలిగించగా, సొంత పార్టీ సీఎం ఇంత బాహాటంగా ఎలా తప్పుబట్టగలుగుతున్నారని సందేహం వ్యక్తంచేశాను. 2004నుంచి నాకు కిరణ్‌ తెలుసు. అయితే... సీఎంగా ఆయన హావభావాలలో మార్పును గమనించాను. రాష్ట్రాల అభిప్రాయం తెలుసుకోకుండా.. ఆమోదం పొందకుండా, అసెంబ్లీ తీర్మానం లేకుం డా విభజనకు ఆస్కారం లేదని కిరణ్‌ వాదించారు.
 
‘రాయల్‌’పోయి... ‘తెలంగాణ’ 
తెలంగాణలోనే ఉన్న ఖమ్మం జిల్లాకు కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలతో సంబంధం ఉంది. దీన్ని తెలంగాణలో కలపడంపై ఆలోచించాల్సి వచ్చింది. ఇదే సమయంలో రాయలసీమలోని అనంతపురం, కర్నూలు జిల్లాలను కూడా కలుపుతూ రాయలతెలంగాణ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనా వచ్చింది. దీన్ని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ సమర్థిస్తూ దీనివల్ల కొత్తరాష్ట్రం ‘సెక్యులర్‌’గా అవతరిస్తుందన్నారు. సీమలోని కాంగ్రెస్‌ నేతలూ దీన్ని సమర్థించారు. దీనిపై అనంత, కర్నూలు జిల్లాల నేతలు రఘువీరారెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, కోట్ల సూర్యప్రకాశరెడ్డి తరచూ నన్ను కలిసేవారు. ఇందుకోసం 1600 పంచాయతీల తీర్మానాలతో తెలంగాణలో విలీనం కోరారు. రాయల్‌-తెలంగాణపై అసెంబ్లీకి బిల్లు పంపితే రెండు జిల్లాల ఎమ్మెల్యేలు 28 మంది మద్దతుంటుందని స్పష్టం చేశారు. ఈ రెండింటిని కలిపితే ఎంపీల సంఖ్య ఏపీ, తెలంగాణాల్లో సమానంగా ఉంటుందని వాదించారు. రాయల్‌ తెలంగాణగా 12 జిల్లాలతో బిల్లుల రూపకల్పన జరిగింది. కానీ, కాంగ్రెస్‌, మంత్రివర్గ ఉపసంఘం 10 జిల్లాల తెలంగాణ వైపే మొగ్గు చూపాయి.
 
కొత్త రాజధానిపై మౌనం ఇందుకే... 
విభజన జరగ్గానే ఏపీ రాజధానిపైనా నిర్ణయం తీసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తంకాగా అధ్యయనం, అభిప్రాయ సేకరణ సాగింది. శివరామకృష్ణన్‌ కమిటీ వేశాం. కర్నూలు, విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ పేర్లను సూచించారు. అయితే.. విభజన సమయంలో ప్రకటిస్తే కొత్త రాష్ట్రంలో కొత్త అలజడి మొదలవుతుందనే మౌనం దాల్చాం.
 
మరో ‘హైదరాబాద్‌’ కాకూడదు 
ఏపీ రాజధాని మరో హైదరాబాద్‌ కా కూడదు. కర్నూలు రాజధానిగా ఉన్నప్పు డు గుంటూరులో హైకోర్టు ఉంది. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌కాగా జబల్‌పూర్‌లో హైకోర్టు ఉంది. ఏపీలోనూ అభివృద్ధి కేంద్రీకృతం కారాదని కమిటీకి సూచించాను.
 
టీఆర్‌ఎస్‌ విలీనంపై ఆశ 
తెలంగాణ ఇచ్చాక 2014 ఎన్నికలకుముందే టీఆర్‌ ఎస్‌ విలీనమవుతుందని కాంగ్రెస్‌ ఆశించింది. ఎందుకంటే... సీమాంధ్రలో కాంగ్రె్‌స విజయావకాశాలు లేవు... వైసీపీ బలపడుతోంది. కనీసం తెలంగాణలోనైనా బలాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్‌ ప్రయత్నించింది. మొత్తం ప్రక్రియలో డిసెంబర్‌ 9 ప్రకటన కీలక మలుపు. విభజనతో ఎన్నికల్లో లబ్ధి తథ్యమని అధిష్ఠానాన్ని ఆజాద్‌ ఒప్పించడం మరో మలుపు. విభజన తర్వాత రెండు రాష్ట్రాలు కలిసిమెలిసి సాగేందుకు ఒక వ్యవస్థ అవసరమని భావించాను. అందుకే ఉమ్మడి గవర్నర్‌ ప్రతిపాదన తెచ్చాను. మంత్రుల బృందంలో అందరి మద్దతూ లభించింది. ఉమ్మడి రాజధానిలో పదేళ్లు గవర్నర్‌ పాత్ర కీలకమని జీవోఎం అభిప్రాయపడింది. వివాదాలొస్తే ప్రతిసారీ కేంద్రం జోక్యం చేసుకోవడం కుదరదు.
 
అప్పుడు... రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 371-హెచ్‌ గురించి సీనియర్‌ నేత జైపాల్‌ రెడ్డి నా దృష్టికి తెచ్చారు. గవర్నర్‌ పాత్రను దీని ప్రకారం నిర్వచించవచ్చునని ఓ పరిష్కార మార్గం చూపించారు. ఇక రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపకం చాలా కీలకం. దీన్ని దృష్టిలో పెట్టుకునే... కృష్ణా, గోదావరి బోర్డులను ప్రతిపాదించాను.
అలాగే... కేంద్ర జలవనరుల మంత్రి ఆధ్వర్యంలో ఇద్దరు సీఎంలు, ఇతరులు సభ్యులుగా అపెక్స్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేయాలని సూచించాను. జీవోఎం పని ముగిసి బిల్లు తయారైంది. ఇది పార్లమెంటు ఆమోదం పొందడమే మిగిలింది. దీనిపై 2014 ఫిబ్రవరి 12న ప్రధాని మన్మోహన్‌ బీజేపీ నేతలతో సమావేశం నిర్వహించారు. ‘ఆమోదానికి సహకరిస్తాం. కానీ... ఎలాంటి గందర గోళం తలెత్తకూడదు’ అని వారు షరతుపెట్టారు. మరునాడు లోక్‌సభలో బిల్లు పెట్టేందుకు హోంమంత్రి లేవగానే లగడపాటి రాజగోపాల్‌ దూసుకెళ్లి పెప్పర్‌ స్ర్పే చల్లారు.
 
టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి సెక్రటరీ టేబుల్‌పై అద్దాన్ని బద్దలుకొట్టి, మైకును విరగ్గొట్టారు. పెప్పర్‌ స్ర్పేవల్ల చాలామంది అస్వస్థతకు గురయ్యారు. గంట తర్వాత సభ మళ్లీ సమావేశమైంది. 16మంది సీమాంధ్ర ఎంపీల ను సస్పెండ్‌ చేశారు. ఈ ఘటనలతో దిగ్ర్భాంతికి గురయ్యాను. బిల్లు ప్రవేశపెట్టినట్లేనని హోంమంత్రి, అసలు అజెండాలోనే లేదని విపక్ష నేత సుష్మాస్వరాజ్‌ ప్రకటించారు. అయితే... చర్చకు అనుమతించే అధికారం స్పీకర్‌కు ఉందని కమల్‌నాథన్‌ చెప్పారు. ఇక ఫిబ్రవరి 17న నేను, చిదంబరం కలిసి ఆడ్వాణీ గదికి వెళ్లాం. సుష్మా స్వరాజ్‌, అరుణ్‌జైట్లీ, వెంకయ్య కూడా అక్కడ ఉన్నారు. ఆ మరుసటి రోజున (2014 ఫిబ్రవరి 18) విభజన బిల్లు ప్రవేశపెడతామని సమాచారం ఇచ్చాం. సీమాంధ్ర ప్రయోజనాలు కాపాడాలని... బిల్లు సాఫీగా ఆమోదం పొందేలా చూడాలని వెంకయ్య కోరారు. బిల్లులో పేర్కొన్నట్లుగా గవర్నర్‌ పాత్ర ఉండాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని జైట్లీ చెప్పారు. దీనికి సంబంధించి ఆ తర్వాత నేను జైట్లీకి ఈ-మెయిల్‌లో వివరణ పంపాను..
 
సెక్షన్‌- 8 ఎందుకంటే...
ఉమ్మడి రాజధాని విషయంలో గవర్నర్‌కు ప్రత్యేక పాత్ర కల్పించడానికి తగిన కారణాలు ఉన్నాయి. కేసీఆర్‌తోపాటు టీఆర్‌ఎస్‌ నాయకులు బాగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఇందులో ప్రధానమైనది. ‘తెలంగాణ జాగో, ఆంధ్రావాలా బాగో’, హైదరాబాద్‌ సిర్ఫ్‌ హమారా’ వంటి నినాదాలు... తెలంగాణ ఏర్పడిన తర్వాత ‘చూసుకోవాల్సిన’ సీమాంధ్ర ఉద్యోగులను గుర్తించామని తెలంగాణ జేఏసీ ప్రకటించడం వంటివి మా దృష్టికి వచ్చాయి. ఈ సెక్షన్‌పై షిండే, చిదంబరంతోపాటు కేసీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినప్పటికీ... హైదరాబాద్‌లో నివసించే వారిలో మరీ ముఖ్యంగా కోస్తా నుంచి వచ్చిన వారిలో విశ్వాసం పాదుకొల్పేందుకు, భరోసా ఇచ్చేందుకు ఈ చర్య అవసరమని జీవోఎం భావించింది. 

పట్టువదలని కేసీఆర్‌ ‘‘యూపీఏ ప్రభుత్వం 2004లో ఏర్పడింది. మే 16న సోనియా నివాసంలో కూటమి నేతలం కలిశాం. కనీస ఉమ్మడి కార్యక్రమంలో ‘త్వరలోనే తెలంగాణ ఏర్పాటు’ విస్పష్టంగా ఉం డాలని కేసీఆర్‌ పట్టుబట్టారు. కానీ... కాంగ్రె్‌సతోపాటు సీపీఎంవంటిపక్షాలు కుదరదన్నాయి. నాకూ ఇబ్బందిగానే అనిపించింది. ప్రత్యామ్నాయాలపై కసరత్తు చేసినా కుదరలేదు. ఇక కాంగ్రెస్‌లో దిగ్గజ ‘డ్రాఫ్ట్స్‌మన్‌’ ప్రణబ్‌ ముఖర్జీతో గంటలకొద్దీ గడిపాను. ఏంచేసినా తెలంగాణపై కేసీఆర్‌ వెనక్కి తగ్గలేదు. ప్రొఫెసర్‌ జయశంకర్‌తో భేటీ ఏర్పాటు చేయించారు. చివరికి... నేను, ప్రణబ్‌ కలిసి కేసీఆర్‌తో చర్చించి, ‘ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును ప్రభుత్వం తగు సమయంలో, తగిన సంప్రదింపులు, విస్తృత ఏకాభిప్రాయం మేరకు పరిశీలిస్తుంది’’ అని చేర్చాం. 

హైదరాబాద్‌పై తర్జనభర్జన తెలంగాణ సంస్కృతి-వారసత్వం హైదరాబాద్‌తోనే ముడిపడి ఉన్నాయి. ఇదే సమయంలో భూముల అందుబాటు, ఇతర అంశాలవల్ల హైదరాబాద్‌లో 1950 దశకం మధ్యనుంచే పెట్టుబడులు పెరిగాయి. సినీ పరిశ్రమ కూడా ఇక్కడే ఉంది. చంద్రబాబు హయాంలో 1996-2003 మధ్య బాగా అభివృద్ధి జరిగింది. తర్వాత.. వైఎస్‌ కూడా కొనసాగించారు. ఉమ్మడి ఏపీకి హెచ్‌ఎండీఏ ప్రాంతాలు ఆర్థిక వనరుగా మారాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలో హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలన్న డిమాండ్‌ సీమాంధ్ర నుంచి వచ్చింది. జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ కూడా ఈ అంశంపై సమీక్షించింది. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ 2013 జూలైలో కొత్త కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేయరాదని నిర్ణయించింది. అందుకే ఆ ప్రతిపాద నను తిరస్కరించారు.

No comments:

Post a Comment