Wednesday 1 January 2014

డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా! - BABU

డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా!

Published at: 02-01-2014 04:22 AM
 New  0  0 
 
 

ఆడపిల్ల భద్రతకు నాదీ పూచీ
ఆడబిడ్డలకు మాహాలక్ష్మీ పథకం
ఏడాదికి పది వంటగ్యాసు సిలిండర్లు
వితంతు మహిళలకు రూ.1000 పింఛన్
ఆధార్‌తో ఖాతాకు లింక్ తొలగిస్తా: బాబు
హైదరాబాద్, జనవరి 1  : తిరుపతి వేదికగా అనధికారంగా 'ఎన్నికల శంఖారావం' మోగించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అదే ఊపును కొనసాగిస్తున్నారు. రాష్ట్ర సమస్యలను, విభజన ప్రక్రియ కష్టాలను ఏకరువు పెడుతూనే..అధికారం ఇస్తే అమలు చేసే ప్రజా సంక్షేమ, సాధికారిక కార్యక్రమాల ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఈ క్రమంలో, రంగారెడ్డి జిల్లా కాటేదాన్ మధుబన్‌కాలనీలో బుధవారం జరిగిన మహిళా సదస్సులో ఆడపడుచుల అభిమానాన్ని చూరగొనేందుకు ప్రయత్నించారు. " నాది ఉడుంపట్టు. ఒకసారి మాటిస్తే వెనక్కిపోను. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువస్తే, ఆడపిల్ల భద్రతకు పెద్ద పీట వేస్తాం. డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తాం'' అని ప్రకటించారు. రాష్ట్రంలో మహిళల భద్రత తన బాధ్యతగా భుజస్కందాలపై వేసుకుంటానని భరోసా ఇచ్చారు. ఏ ఆపద వచ్చినా ఒక అన్నగా, కొడుకుగా అండగా ఉంటానని ధైర్యం చెప్పారు.
మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా అన్ని పటిష్టమైన చర్యలు తీసుకునేందుకు టీడీపీ సిద్దంగా ఉందని, దానిపై ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమయ్యాయని చెప్పారు. "అధికారంలోకి రాగానే మహిళలపై జరుగుతున్న ఘోరాలపై దృష్టిపెడతాం. రాష్ట్ర స్థాయిలో ఐజీ స్థాయి అధికారితో ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తాం. జిల్లాస్థాయిలో అడిషనల్ ఎస్పీస్థాయి అధికారి ఈ విభాగాన్ని పర్యవేక్షిస్తారు'' అని వివరించారు. మహిళలు కేంద్రంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను సిద్ధం చేస్తున్నామ న్నారు. "మహిళలను ఆర్థికంగా పైకి తీసుకు వచ్చేందుకు డ్వాక్రా గ్రూపులకు మరింతగా ప్రోత్సాహాలు ఇస్తాం. ఇప్పటివరకూ వారు తీసుకున్న రుణాలను రద్దుచేస్తాం. అలాగే..కొంత మొత్తాన్ని పొదుపు చేస్తే పెళ్లినాటికి మూడు లక్షల వరకూ ఇచ్చే మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెడతాం. వితంతువులకు వెయ్యి రూపాయల పింఛన్, వృద్ధులకు ప్రతి నియోజక వర్గంలో వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేసి సాయాన్ని అందిస్తామని వెల్లడించారు. ఏడాదికి 10 గ్యాస్‌సిలిండర్లు ఇస్తామని, ఆధార్‌తోనూ, బ్యాంకు ఖాతాలతోనూ సంబంధం లేకుండా నేరుగా సబ్సిడీ ధరలకే సిలిండర్లను ఇస్తామని చెప్పారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామని, ఆర్టీసీ, విద్యుత్ ధరలను కూడా అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు. కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్న బెల్టు షాపులను రద్దు చేస్తామని చెప్పారు. "రేషన్‌కార్డులు, ఇండ్ల పట్టాలను మహిళల పేరుతోనే ఇస్తాం. మహిళా కమిషన్‌ను మరింత పటిష్టం చేస్తాం. ఆడపిల్లలకు ప్రత్యేక పాఠశాలలను పెట్టి ఉచిత విద్య అందిస్తాం'' అని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి అనకొండలా పెరిగిపోయిందన్నారు. సోనియా గాంధీ అనకొండ అయితే ఆమె తయారు చేసిన అనకొండలు వైఎస్ జగన్మోహన రెడ్డి, సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రాలంటూ విరుచుకుపడ్డారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలో అనకొండల మాదిరిగా ప్రజల సొమ్మును మెక్కేస్తున్నారని ఆరోపించారు.
ఒకరిది దోపిడీ.. మరొకరిది దందా!
విభజనలో హేతుబద్ధత లేకుండా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకు టీఆర్ఎస్‌తోనూ, వైసీపీతోనూ కలిసి కాంగ్రెస్‌పార్టీ కుట్ర పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు ప్రాంతాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపించాకే విభజన పై ముందుకు పోవాలని సూచించారు. రాజకీయంగా లబ్ధిపొందడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ విభజన అంశాన్ని తీసుకువచ్చిందని దుయ్యబట్టారు.
అవినీతి వ్యతిరేక పార్టీలతోనే పొత్తు
తమ పార్టీకి ఎక్కువ మంది ఎంపీలను అందిస్తే కేంద్రంలో చక్రం తిప్పుతామని చెప్పారు. "ఈసారి మామూలుగా ఉండదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం నుంచి అన్నిరకాల సాయాన్నితీసుకుంటామ''న్నారు. వచ్చేఎన్నికల్లో అవినీతి పై పోరాటం చేసే పార్టీతోనే పొత్తు ఉంటుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ రావడంతోనే భూకబ్జాలు, దోపిడీలు పెరిగిపోయాయని విమర్శించారు. "సైకిళ్ల పై తిరిగిన వారు రాత్రికి రాత్రే కార్లలో తిరుగుతున్నారు. పేదల పొట్టకొడుతున్న వారి పొట్టపగిలే రోజులుదగ్గర లోనే ఉన్నాయి. అన్యాయం చేసే వారి గుండెల్లో నిద్రపోతాను. రౌడీలు, గూండాల పని పడతాను. నాది ఉడుం పట్టు. నేనొక మాట ఇస్తే దాని కోసం కట్టుబడి ఉంటాన''ని చెప్పారు.
చంద్రబాబు.. దమ్మున్న నాయకుడు: నీరజారావు
"నాయకుడంటే ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేవాడు. వారికి అన్యాయం జరిగితే రక్షించేవాడు. అలాంటి దమ్మున్న నాయకుడు చంద్రబాబునాయుడ''ని నీరజారావు కితాబిచ్చారు. వైఎస్ కుటుంబం ఆక్రమణకు గురైన జూబ్లీహిల్స్‌లోని తన భూమిని సుదీర్ఘ పోరాటం తర్వాత దక్కించుకున్న నీరజారావు..మహిళా సదస్సులో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. "అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి బావమరిది రవీంద్రనాధ్ రెడ్డి నా ప్లాటును కబ్జాచేశారు. జగన్‌ను కలిసినా నాకు న్యాయం జరగలేదు. పైగా బెదిరింపులు పెరిగాయి. అధికారులు వారికే వంత పాడారు. ఈ క్లిష్ట సమయంలో చంద్రబాబును కలిశాను. అడిగినంతనే ఆయన స్పందించారు. ఇప్పటిదాకా నాకు వెన్నుదన్నుగా నిలిచారు. ఆయన నిజంగా దమ్మున్న మొగాడు. అలాంటి నాయకుడికి మహిళలు అండగా ఉండాలి. ఆయన అధికారంలోకి వస్తే మీ హక్కులను కాపాడతారు. దానికి సజీవ సాక్ష్యం నా ఉదంతమే'' అని వివరించారు.
- See more at: http://www.andhrajyothy.com/node/49340#sthash.VeUPO91u.dpuf

No comments:

Post a Comment