Wednesday 2 March 2016

సాక్షికి సమాధానం ఇస్తారా? ఎదురుదాడి చేస్తారా?

సాక్షికి సమాధానం ఇస్తారా? ఎదురుదాడి చేస్తారా?

ఏపీ రాజధాని అమరావతిలో జరుగుతున్న అక్రమాలపై సాక్షి దినపత్రిక సంచలన కథనం  ప్రచురించడం చర్చనీయాంశమైంది. ఒక విధంగా సాక్షి…  ప్రభుత్వానికి సవాల్ విసిరినట్టుగా కథనం ఉంది.  రాజధాని దురాక్రమణ పేరుతో కథనం రాసిన సాక్షి అమరావతిలో చంద్రబాబు, లోకేష్, వారి బినామీలు కలిసి వేల ఎకరాలు కొల్లగొట్టారని ఆరోపించింది. తొలుత రాజధాని నూజివీడులో పెడుతామని పీలర్స్ వదలడం ద్వారా అమరావతి ప్రాంతంలో భూముల ధరలు తగ్గేలా చేశారని… అలా ధరలు తగ్గగానే బాబు బినామీలు వేల ఎకరాలు తక్కువ ధరకు కొన్నారని ఆరోపణ.  టీడీపీ నేతలు ఇలా భూములు కొనగానే  అమరావతిని రాజధానిగా ప్రకటించారని కథనం. దీని వల్ల అమరావతి ప్రాంతంలో తక్కువ ధరకు భూములమ్ముకున్న రైతులు,  నూజివీడులో పెట్టుబడులు పెట్టిన రియల్ వ్యాపారులు భారీగా నష్టపోయారు.  ఇలా అందరినీ దారి మళ్లించి రాజధాని ప్రాంతంలో మంత్రి నారాయణ 3 వేల 600 ఎకరాలు,  సుజనా చౌదరి 700 ఎకరాలు, లోకేష్ 500 ఎకరాలు, ప్రత్తిపాటి పుల్లారావు 195 ఎకరాలు సొంతం చేసుకున్నారని కథనం రాసింది.  తమ దగ్గర పక్కా సాక్ష్యాలు కూడా ఉన్నాయని వెల్లడించింది.
అయితే సాక్షి కథనంపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారన్నది చర్చనీయాంశమైంది. ఎప్పటి లాగే రాజధాని అమరావతి బ్రాండ్‌ను దెబ్బతీసేందుకు కుట్రచేస్తున్నారని  ఎదురు దాడి చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాల్‌మనీ సెక్స్ రాకెట్ బయటపడ్డప్పుడు కూడా టీడీపీ నేతలపై మీడియాలో భారీగా కథనాలు వస్తే ఇదే సూత్రాన్ని టీడీపీ నేతలు పాలో అయ్యారు. కాల్ మనీ పేరుతో విజయవాడ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణ చేశారు.  అలా ప్రతిపక్షాలను, మీడియాను ఆత్మరక్షణలో పడేసేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు సాక్షి కథనంపైనా ఇదే సూత్రం ఫాలో అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పైగా సాక్షి పత్రిక జగన్‌కు సంబంధించింది కాబట్టి… అమరావతిలో రాజధాని నిర్మాణం జగన్‌కు ఇష్టం లేదని అందుకే ఇలాంటి కథనాలు రాయిస్తున్నారని బాబు అనుచరులు ఎదురుదాడి చేసే చాన్స్ అధికంగా ఉంది. లేకుంటే ధైర్యంగా సమాధానం ఇస్తారో చూడాలి.

No comments:

Post a Comment