Wednesday 26 April 2017

తాగుబోతు... చంపేశాడు!

తాగుబోతు... చంపేశాడు! 
22-04-2017 02:52:42

మందుకొట్టి.. స్టీరింగ్‌ పట్టిన డ్రైవర్‌.. 17 గంటలుగా డ్రైవింగ్‌
రాత్రి ఒకసారి, తెల్లారాక మరోసారి మద్యపానం..
కారు లైసెన్స్‌తో లారీ నడుపుతూ అరాచకం
(అమరావతి,తిరుపతి - ఆంధ్రజ్యోతి) పరిమితికి మించిన లోడు! డ్రైవర్‌ బాగా మందు తాగాడు! 17 గంటలుగా లారీ నడుపుతూనే ఉన్నాడు! తాగింది దిగకముందే మళ్లీ తాగాడు. స్టీరింగ్‌ మాత్రం వదల్లేదు! ఉన్నోడు ఉండకుండా... పక్కనున్న వ్యక్తితో వాదులాడుతున్నాడు!... చిత్తూరు జిల్లా ఏర్పేడులో ఘోర ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ గురువయ్య పరిస్థితి ఇది! అంతేకాదు... అతగాడికి లారీ నడిపే అర్హత కూడా లేదు. కారు డ్రైవింగ్‌ లైసెన్సుతో 14 చక్రాల లారీని నడిపేస్తున్నాడు. నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందిన తాతమశెట్టి రమేశ్‌ రెండు నెలల కిత్రమే ఈ లారీ (ఏపీ 26 టీడీ 8679) కొన్నాడు. దొరవారిసత్రం మండలం పోలిరెడ్డి పాలెం గ్రామానికి చెందిన గురవయ్య(33)ని డ్రైవర్‌గా పెట్టుకొన్నాడు. అతను ఏడాదిన్నర క్రితం సుళ్లూరుపేట ఆర్టీఏ నుంచి కారు డ్రైవింగ్‌ లైసెన్సు తీసుకున్నాడు. అదే లైసెన్సుతో పొరుగు రాష్ట్రమైన తెలంగాణకు వెళ్లాడు. మహబూబ్‌నగర్‌లో 25 టన్నుల లోడు ఎత్తుకొని...గురువారం రాత్రి 8గంటలకు బయలు దేరాడు. ఫుల్లుగా మద్యం సేవించి రాత్రంతా లారీ నడుపుతూ వచ్చాడు. శుక్రవారం ఉదయం కడప సమీపంలో మళ్లీ మందుకొట్టాడు. స్టీరింగ్‌పై అదుపు కోల్పోయాడు.

జనాన్ని చూసి బ్రేక్‌ వేయాల్సినవాడు, యాక్సిలేటర్‌ నొక్కి విధ్వంసానికి కారణమయ్యాడు. సాధారణంగా రెండు పెగ్గుల మద్యం సేవిస్తే రక్తంలో 30 ఎంజీ లిక్కర్‌ శాతం చూపిస్తుంది. కానీ, గురువయ్య శరీరంలో ఏకంగా 287ఎంజీ శాతం కనిపించింది. రవాణా కమిషనర్‌ బాలసుబ్రమణ్యం చిత్తూరు డీటీసీ, తిరుపతి ఆర్టీవోలను ఘటనా స్థలికి పంపారు. లారీ యజమానిపైనా కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ప్రమాదం జరిగిన తర్వాత తీసుకున్న చర్యలు సరే! కారు డ్రైవింగ్‌ లైసెన్సు ఉన్న గురువయ్య ఇన్నాళ్లుగా... లారీని రాష్ట్రాలు దాటిస్తుంటే అధికారులు, పోలీసులు ఏం చేస్తున్నట్లు? మద్యం మత్తులో వందల కిలోమీటర్లు నడుపుతుంటే... మన ‘తనిఖీ వ్యవస్థలు’ ఏం పని చేస్తున్నట్లు?


2 గంటల్లోనే పంచనామా..పోస్టుమార్టం
22-04-2017 02:48:30
15 మృతదేహాలకు పంచనామా నిర్వహించి రెండు గంటల వ్యవధిలోనే పోస్టుమార్టం పూర్తిచేసి స్వగ్రామాలకు తరలించేందుకు అధికారులు వేగంగా ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్న, జేసీ శ్రీగిరీషా, సబ్‌కలెక్టర్‌ నిషాంతకుమార్‌, ఎస్పీ జయలక్ష్మి, తిరుమల ఏఎస్పీ మురళీకృష్ణ, శ్రీనివాసులు, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రమణయ్య అర్బన్‌ తహసీల్దార్‌ చంద్రమోహన్‌, వైద్యులు తదితరులంతా ఆస్పత్రికి చేరుకున్నారు. ఒక్కో మృతదేహానికి ఒక్కొక్కరు బాధ్యత వహించి యుద్ధ ప్రాతిపదికన పంచనామా నిర్వహించారు. వెనువెంటనే శవ పరీక్షలు పూర్తి చేశారు. ఇలా రెండు గంటల్లోనే ఈ ప్రక్రియ ముగించేలా అధికారులు చర్యలు చేపట్టారు.

No comments:

Post a Comment