Wednesday 26 April 2017

ఏర్పేడు లో లారీ బీభత్సం, 15మంది మృతి

ఏర్పేడు లో లారీ బీభత్సం, 15మంది మృతి
Sakshi | Updated: April 21, 2017 18:40 (IST)
చిత్తూరు జిల్లాలో లారీ బీభత్సం, 15మంది మృతి
చిత్తూరు : చిత్తూరు జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  ఏర్పేడు పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో ఈ రోజు మధ్యాహ్నం ఓ లారీ అదుపు తప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని, అనంతరం పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 15 మంది దుర్మరణం చెందగా, మరో 15 మందికి పైగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత‍్తం రుయా ఆస్పత్రికి తరలించారు.
ఇసుక దందాపై నిరసన వ్యక్తం చేస్తూ పోలీసు స్టేషన్ వద్ద ధర్నా చేస్తున్న గ్రామస్తుల మీదకు వేగంగా వెళ్తున్న లారీ దూసుకెళ్లింది. ఆ తర్వాత ఒక విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. వాహనాలను కూడా ఢీకొనడంతో వాటిలో పెట్రోలు లీకై మంటలు చెలరేగాయి. ఈ మూడు కారణాల వల్ల మొత్తం 15 మంది మరణించారు. మరో 15 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యవర్గాలు చెబుతున్నాయి. గాయపడినవారిలో ఇద్దరు పత్రికా ప్రతినిధులు కూడా ఉన్నారు.
మరోవైపు ఏర్పేడు రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... చిత్తూరు జిల్లా కలెక్టర్‌ తో ఫోన్‌లో మాట్లాడారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. అలాగే ఈ ఘటనపై హోంమంత్రి చినరాజప్ప ... తిరుపతి అర్బన్‌ ఎస్పీతో మాట్లాడి పరిస్థితిని స్వయంగా సమీక్షించాలని సూచించారు.

No comments:

Post a Comment