Tuesday 14 February 2017

ఏపీకి ప్రమాద ఘంటికలు – టైమ్స్ ఆఫ్‌ ఇండియా కథనం

ఏపీకి ప్రమాద ఘంటికలు – టైమ్స్ ఆఫ్‌ ఇండియా కథనం

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై ప్రముఖ ఆంగ్ర పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాన్ని ప్రచురించింది. ఆంధ్రప్రదేశ్ అత్యంతవేగంగా అప్పుల ఊబిలో కూరుకుపోతోందని గణాంకాలతో సహా వెల్లడించింది. దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించిందని కథనం ప్రచురించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ అప్పు లక్షా 79వేల 140కోట్లకు చేరింది. ఇది 2021-22 నాటికి మూడు లక్షల రెండు వేల కోట్లకు చేరే ప్రమాదం ఉందని రిజర్వ్‌ బ్యాంక్ హెచ్చరించింది. ప్రభుత్వం ఇష్టానుసారం చేస్తూ వెళ్తున్న అప్పుల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందట.

ఈ ఆర్థిక సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం రూ. 18వేల 796 కోట్లు అప్పు చేసింది. ఇందులో రూ. 12 వేల 661కోట్లు వడ్డీ కిందే వెళ్లిపోయింది. కేవలం ఆరు వేల 135 కోట్లు మాత్రమే సంక్షేమ పథకాలకు ఖర్చుపెట్టారు. వచ్చే ఆర్థిక ఏడాదికి గాను మరో రూ. 20వేల 675కోట్లను ఏపీ ప్రభుత్వం అప్పుగా తేనుంది. ఇందులో రూ. 15, 985 కోట్లు వడ్డీ కింద చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు-జీఎస్డీపీ నిష్పత్తి హద్దులను కూడా దాటేసింది. ఇది 28. 59 శాతం వద్ద ఉంది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అని రిజర్వ్ బ్యాంక్ కూడా అభిప్రాయపడింది. పైగా 2021-22 నాటికి ఏపీ అప్పు రూ. 3లక్షల కోట్లు దాటుతుందని అప్పుడు … పరిపాలన మరింత కష్టమవుతుందని వెల్లడించింది.

ఏపీ ప్రత్యేక చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లమ్ మాత్రం… పెరిగిన అప్పులు, తిరిగి చెల్లించాల్సిన వడ్డీ వంటి అంశాలపై సీరియస్‌గా దృష్టి సారించామని… ఖర్చు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. అయినా నాలుగువేల కోట్లు పెట్టి పుష్కరాలు చేసిన ప్రభుత్వం, ప్రత్యేక విమానాల్లో విహరించే ముఖ్యమంత్రి … ఖర్చు తగ్గించుకుంటామంటే ఎవరైనా నమ్ముతారా?

No comments:

Post a Comment