Friday 8 July 2016

పవిత్ర సంగమ ప్రాంతంలో..దుర్గమ్మ నమూనా ఆలయం

పవిత్ర సంగమ ప్రాంతంలో..దుర్గమ్మ నమూనా ఆలయం
08-07-2016 07:06:50

(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
కృష్ణా పుష్కరాలు ఆగస్టు 12 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్కరాలకు విచ్చేసే భక్తులు అమ్మవారిని దర్శించుకునేలా ఒక నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేయాలని, ఈ ఆలయాన్ని కృష్ణవేణికి నిత్య నవహారతులిచ్చే పవిత్ర సంగమ ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలని దేవాదాయ ధర్మాదాయ శాఖాధికారులను ఆదేశించారు. దుర్గగుడిలో జరిగే పూజా కార్యక్రమాలు, హారతలు నమూనా ఆలయంలో కూడా జరిగేలా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు.

భక్తులకు సౌకర్యంగా..
పుష్కరాలకు విచ్చేసే పుష్కర యాత్రికులు రోజుకు పది లక్షలకు పైగా ఉంటారని, సెలవు దినాలయితే ఈ సంఖ్య 25 లక్షలు దాటుతుందని ప్రభుత్వ అధికారుల అంచనా. అన్ని లక్షల మంది భక్తులకు దుర్గమ్మ దర్శనం దుర్లభమని అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. అటువంటి సమస్య తలెత్తకుండా సంగమ ప్రాంతంలో కనకదుర్గమ్మ నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేయాలని దేవాదాయ ధర్మాదాయ శాఖాధికారులను సీఎం ఆదేశించారు. నమూనా ఆలయంలో కూడా పూజాదికాలు దుర్గగుడి అర్చకుల ఆధ్వర్యంలో జరగుతాయి. భక్తులకు ఉచిత ప్రసాద పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తులు ఇంటికి ప్రసాదాన్ని తీసుకువెళ్లేందుకు వీలుగా పంచ పదార్థాల మిశ్రమం భవానీ ప్రసాదం, లడ్డు ప్రసాదాన్ని అందుబాటులో ఉంచుతారు. వీటితో పాటు అమ్మవారి ఉచిత కుంకుమ ప్రసాదాన్ని కూడా భక్తులకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నమూనా ఆలయం చుట్టూ గ్రీనరీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మను ప్రతి రోజూ లక్ష మంది దర్శించుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని దుర్గగుడి అధికారులను సీఎం ఆదేశించారు.

పీఠాధిపతులకు ప్రత్యేక ఆహ్వానం
పవిత్ర పుష్కరాలను వైదిక సంప్రదాయాల ప్రకారం నిర్వహించాలని, నిర్వహణపై పీఠాధిపతులతోనూ, స్వామిజీలతోనూ సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేయాలని కొంత కాలంగా పలువురు పీఠాధిపతులు డిమాండు చేస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పుష్కరాల సందర్భంగా పవిత్ర సంగమ ప్రాంతంలో కృష్ణవేణికి ప్రతి రోజూ నిర్వహించే నిత్య నవ హారతలకు అన్ని పీఠాలకు సంబంధించిన పీఠాధిపతులను, స్వామిజీలను ఆహ్వానించాలని సీఎం సంకల్పించారు.

సంగమ ప్రాంతంలో
సాంస్కృతిక కార్యక్రమాలు
పుష్కరాలకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు ఆధ్మాత్మికతతో పాటు తెలుగు సంస్కృతి, కళా వైభవాలను చాటి చెప్పేందుకు సంగమ ప్రాంతంలో తెలుగు సాంస్కృతిక వైభవ కళావేదికను ఏర్పాటు చేయనున్నారు. ఈ వేదికపై ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి వరకు జానపద, చారిత్రక, పౌరాణిక నాటకాలతో పాటు తెలుగు వారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ప్రముఖలపై చిత్ర మాలికను ప్రదర్శించనున్నారు. ఈ కళావేదిక నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వ భాషా- సాంస్కృతిక శాఖకు అప్పగించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు అందరినీ ఆకట్టుకునేలా సప్తవర్ణాల లేజర్‌ షోను ప్రతి రోజూ రాత్రి వేళల్లో ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.

No comments:

Post a Comment