Friday 29 April 2016

టీడీపీ, బీజేపీపై కాంగ్రెస్‌ ‘ప్రైవేటు’ అస్త్రం

టీడీపీ, బీజేపీపై కాంగ్రెస్‌ ‘ప్రైవేటు’ అస్త్రం 
30-04-2016 01:26:22

  • హోదాపై ప్రైవేటు సభ్యుల బిల్లు 
  • రాజ్యసభలో ప్రవేశపెట్టిన కేవీపీ 
  • బిల్లును వెనక్కి తీసుకోవాలన్న నక్వీ 
  • ఉపసంహరించుకొనేది లేదన్న కేవీపీ 
  • బిల్లుపై ఓటింగ్‌ పట్టుబడతానని స్పష్టం 
  • తెరపైకి కోరం సమస్య.. చర్చ వాయిదా 
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై టీడీపీ, బీజేపీలను ఇరుకునపెట్టేందుకు కాంగ్రెస్‌ సిద్ధమైంది. ఏపీ విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశాన్ని చేరుస్తూ సవరణ చేపట్టాలంటూ కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రైవేటు సభ్యుల బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై ఎలా స్పందించాలో తెలియక బీజేపీ, టీడీపీలు సందిగ్ధంలో పడ్డాయి. సాధారణంగా ప్రైవేటు సభ్యుల బిల్లుపై చర్చ జరిగిన తర్వాత సంబంధిత శాఖ మంత్రి హామీ ఇచ్చి బిల్లును ఉపసంహరించుకోవాలని బిల్లు పెట్టిన సభ్యుడికి విజ్ఞప్తి చేస్తారు. బిల్లు పెట్టిన సభ్యుడు కూడా పెద్దగా పట్టు పట్టకుండా ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకువచ్చామన్న సంతృప్తితో బిల్లును ఉపసంహరించుకుంటారు. అయితే బిల్లుపై ఓటింగ్‌ జరపాల్సిందేనని సభ్యుడు పట్టుపడితే మాత్రం కచ్చితంగా ఓటింగ్‌ నిర్వహించాల్సి ఉంటుంది. అందుకే ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై టీడీపీ, బీజేపీలను ఇరుకునపెట్టేందుకు కేవీపీ ప్రైవేటు సభ్యుల బిల్లును మార్గంగా ఎంచుకున్నారు. 
 
బిల్లు ఉపసంహరణకు ససేమిరా
రాజ్యసభలో కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు సభ్యుల బిల్లుపై శుక్రవారం కొద్దిసేపు చర్చ జరిగింది. ఆ సమయంలో పార్లమెంటరీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ, కేవీపీ సీటు దగ్గరకు వెళ్లి బిల్లును ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కానీ కేవీపీ ససేమిరా అంగీకరించలేదు. ఈ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ చెప్పినా వెనక్కి తగ్గేది లేదని, అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినా ఫర్వాలేదని తనకు నచ్చజెప్పాలని చూసిన మరో కాంగ్రెస్‌ సభ్యుడు నాచియప్పన్‌కు కేవీపీ తెగేసి చెప్పారు. ప్రైవేటు సభ్యుల బిల్లు విషయంలో అధికారపక్షాన్ని ఇరుకున పెట్టాలన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్‌ సభాపక్ష నేత గులాం నబీ ఆజాద్‌ శుక్రవారం సభకు దూరంగా ఉండిపోయినట్లు సమాచారం. దీంతో ఆజాద్‌తో మాట్లాడి బిల్లును ఉపసంహరించుకొనేలా చేయాలని నఖ్వీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ పరిస్థితుల్లో టీడీపీ సభ్యుడు సీఎం రమేష్‌.. కోరమ్‌ అంశాన్ని తెరపైకి తెచ్చారు. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్‌ సీరియ్‌సగా ఉంటే ఆ పార్టీకి చెందిన సభ్యులు సభలో ఎందుకు లేరని రమేష్‌ నిలదీశారు. కోరం లేకుండా సభలో బిల్లుపై ఎలా చర్చిస్తామన్నారు. దీనికి కేవీపీ స్పందిస్తూ.. బిల్లును నెగ్గించుకోదగ్గ బలం తమ వద్ద ఉందని, అలా లేదనుకుంటే బిల్లును ఓడించాలని టీడీపీ, బీజేపీలకు సవాల్‌ విసిరారు. ఏపీకి హోదా వద్దనుకున్న వారే బిల్లును ఓడిస్తారన్నారు. కాగా, ప్రత్యేకహోదా విషయంలో కాంగ్రెస్‌ మొసలి కన్నీరు కారుస్తోందని టీడీపీ ఆరోపించింది. ప్రైవేటు బిల్లుపై ఓటింగ్‌ సమయంలో డివిజన్‌కు పట్టుపడితే బిల్లుకు తాము మద్దతు ఇవ్వబోమని టీడీపీ ఎంపీలు స్పష్టం చేశారు. ఏపీని విడదీసిన పాపం కాంగ్రెస్‌ మోయాల్సిందేనన్నారు. 
 
రాష్ట్రాభివృద్ధి కోసమే ప్రైవేటు బిల్లు: కేవీపీ
శుక్రవారం సభలో చర్చ అనంతరం కేవీపీ విలేకరులతో మాట్లాడారు. బిల్లులోని అంశాల్లో ఏ ఒక్కదానికీ కేంద్రం సరైన సమాధానం చెప్పలేదన్నారు. పోలవరానికి నిధులు మంజూరు చేస్తామని చెప్పారే తప్ప, దాన్ని ఎప్పటిలోగా పూర్తి చేయాలన్న ఆలోచన కూడా కేంద్రం చేయడం లేదని విమర్శించారు. ఏపీకి హోదా ఇవ్వడం కుదరకుంటే.. ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని సభలోనే ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతమున్న ఆర్థిక పరిస్థితి.. అవసరాలు.. ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని నేను ప్రత్యేక హోదా అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నానే తప్ప నా వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం కాదు. రాజకీయాలకంటే రాష్ట్ర అభివృద్దే ముఖ్యం’’ అని కేవీపీ స్పష్టం చేశారు. కేంద్రంలోని పెద్దలు ప్రత్యేకహోదా విభజన చట్టంలో లేదంటున్నారు కాబట్టే చట్ట సవరణకు ప్రైవేటు సభ్యుల బిల్లును ప్రవేశపెట్టానన్నారు. కోరమ్‌ లేదన్న సాకుతో శుక్రవారం బిల్లుపై పూర్తిస్థాయిలో చర్చించలేదని, మరోసారి చర్చకు వచ్చినప్పుడు ఓటింగ్‌కు పట్టుబడతానన్నారు

No comments:

Post a Comment