Tuesday, 25 August 2015

మరణం ఇలాగా రావొచ్చు..బోగీని చీల్చిన గ్రానైట్‌ రాయి

మరణం ఇలాగా రావొచ్చు..బోగీని చీల్చిన గ్రానైట్‌ రాయి

  • గేటు వేసినా దూసుకెళ్లి  రైలును ఢీ కొట్టిన లారీ
  • అనంతలో ఘోర ప్రమాదం
  • లారీని క్లీనర్‌ నడపడమే కారణం!
అనంతపురం, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ఆదివారం అర్థరాత్రి దాటింది... సమయం 2.15 నిమిషాలు. 20 టన్నుల గ్రానైట్‌ బండను తీసుకొని ఓ లారీ వేగంగా దూసుకెళుతోంది. దారిలో రైల్వే క్రాసింగ్‌ వచ్చింది. అదే సమయంలో రైలు వెళుతుండడంతో గేటు వేసి ఉంది. మితిమీరిన వేగంతో వెళుతున్న లారీ గేటును ఛిన్నాభిన్నం చేసుకుంటూ రైలును ఢీకొట్టింది. లారీలోని 20 టన్నుల గ్రానైట్‌ రాయి రైలు బోగీని ఛిద్రం చేసుకుంటూ ఇవతలనుంచి అవతలకు వెళ్లి పడింది. ఈ ప్రమాదంలో హెచ్‌1ఏసీ బోగీలో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు, లారీ క్లీనర్‌ ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ప్రమాదం అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణ సమీపంలో జరిగింది. మడకశిరనుంచి 20 టన్నుల గ్రానైట్‌ బండతో ఏపీ 16 టీటీ 9885 నెంబర్‌ లారీ ఆదివారం అర్ధరాత్రి బయలు దేరింది. క్లీనర్‌ నాగరాజే ఆ సమయంలో లారీనడుపుతున్నాడు. ఆ లారీ పెనుకొండ సమీపంలోని రాజేశ్వరి కాలనీ సమీపంలో ఉన్న రైల్వే క్రా సింగ్‌ను చేరుకుంది. ఆ సమయంలో బెంగళూరు-నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ వెళుతుండడంతో రైల్వే గేట్‌ వేసి ఉంది. అది గమనించని నాగరాజు అతివేగంతో రైల్వే గేటునుంచి దూసుకుపోయి నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టాడు. లారీలోని గ్రానైట్‌ బండ అతివేగంగా హెచ్‌ 1 బోగీని ధ్వంసం చేసుకుంటూ ఇటు నుంచి అటువైపునకు బుల్లెట్‌లా దూసుకుపోయింది. దీంతో ఆ బోగీలోని ఓ చాంబర్‌లో ప్రయాణిస్తున్న కర్ణాటక రాష్ట్రం రాయచూర్‌ జిల్లా దేవదుర్గ ఎమ్మెల్యే వెంకటే్‌షనాయక్‌(82), అదే ప్రాంతానికి చెందిన రైతు ఈదూరు పుల్లారావు(50), బెంగళూరు ఇండోఫిల్‌ కంపెనీ జనరల్‌ మేనేజర్‌ టీఎ్‌స డీ రాజు(50), అదే బోగీలో ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్న అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణానికి చెందిన సయ్యద్‌ అహ్మద్‌ (48)తోపాటు లారీ నడుపుతున్న తాడిపత్రికి చెందిన నాగరాజు(48) మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలుచేపట్టారు.
 
తప్పిన పెను ప్రమాదం... 
భారీ గ్రానైట్‌ రాయి రైలు బోగీని ఛిద్రం చేసిన క్రమంలో మిగిలిన బోగీలు కూడా కుదుపునకు లోనయ్యాయి. హెచ్‌ 1 బోగీకి ముందున్న ఎస్‌ 1, ఎస్‌2, ఎస్‌3, ఎస్‌4, ఎస్‌5 బోగీలు పట్టాలు తప్పాయి. దాదాపు 300 మీటర్ల దాకా అలాగే ముందుకు సాగడంతో వాటి చక్రాలు ఊడిపోయాయి. అలా వెళ్లిన ఆ బోగీలు 50 అడుగుల ఎత్తులో ఉన్న వంతెనపై నిలిచిపోయాయి. ఏమాత్రం అదుపుతప్పిఉన్నా ఆ బోగీలన్నీ వంతెనపైనుంచి లోయలోకి పడి ఉంటే ఊహించనంత భారీ ప్రాణనష్టం జరిగి ఉండేది. సమాచారం అందగానే కలెక్టర్‌ శశిధర్‌, డీఐజీ సత్యనారాయణ, ఎస్పీ రాజశేఖర్‌బాబు ప్రమాద స్థలికి చేరుకున్నారు. రాష్ట్ర మంత్రులు పల్లె రఘునాథ్‌రెడ్డి, పరిటాల సునీత, జడ్పీ చైర్మన్‌ చమన్‌, స్థానిక ఎమ్మెల్యే బీకే పార్థసారథి ప్రమాద స్థలిని సందర్శించారు. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా, రాహుల్‌గాంధీ దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం కింద రూ.50వేలు చొప్పున బెంగుళూరు డీఆర్‌ఎం సంజయ్‌ అగర్వాల్‌ ప్రకటించారు. రైల్వేశాఖకు సంబంధించి ఎటువంటి లోటుపాట్లు లేనందున ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించలేదని నైరుతి రైల్వే డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ సంజీవ్‌అగర్వాల్‌ ప్రకటించారు.

క్షణాల్లో ప్రమాదం
గేటు వేసినప్పుడు వాహనాలు ఏవీ రాలేదు. రైలు గేటు సమీపంలోకి రాగానే అవతలి వైపు నుంచి వాహ నం వెలుతురు కనిపించింది. ఒక్కసారిగా పెద్ద శబ్దంరావడంతో నా వద్దనున్న గ్రీన్‌సిగ్నల్‌ను రెడ్‌సిగ్నల్‌లోకి మార్చి సమాచారాన్ని అధికారులకు అందించాను. ప్రమాదం క్షణా ల్లో జరిగిపోయింది.      - గేట్‌మన్‌ తిమ్మప్ప

ప్రత్యేక హోదా ఇస్తే ఏం వస్తుంది?

ప్రత్యేక హోదా ఇస్తే ఏం వస్తుంది?
గ్రాంటు, విదేశీ నిధులతోనే నవ్యాంధ్రకు లాభం


హైదరాబాద్‌, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): కేంద్రం నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తుందా!? హోదా పేరు లేకుండా ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తుందా!? అందులో గ్రాంటు ఎంత ఇస్తుంది!? ప్రత్యేక హోదాతో సమానంగా 90 శాతం గ్రాంటు ఇస్తుందా? 70 శాతానికే పరిమితం చేస్తుందా? హోదా ఇస్తే ఏపీకి ఒరిగేదేమిటి? హోదా లేకుండా ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తే ఒనగూరే లబ్ధి ఏమిటి? ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ సందర్భంగా వ్యక్తమవుతున్న ప్రశ్నలివి. ప్రత్యేక హోదాతో వచ్చే లాభాలు.. ఏపీకి కలిగే ప్రయోజనంపై ఆర్థిక శాఖ వర్గాలు ఒక నివేదిక తయారు చేశాయి. దాని ప్రకారం, కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందే సాయం రెండు రకాలుగా ఉంటుంది. ప్రత్యేక కేటగిరీ హోదా పొందిన రాష్ట్రాలకు ఒక పద్ధతిలో, మిగిలిన రాష్ట్రాలకు మరో పద్ధతిలో ఈ సాయం ఇస్తారు. మన దేశంలో ప్రస్తుతం ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలు పదకొండు (జమ్మూ కశ్మీర్‌, సిక్కిం, హిమాచల్‌, ఉత్తరాఖండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, అసోం, మణిపూర్‌, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్‌, త్రిపుర) ఉన్నాయి. కేంద్రం తాను రాష్ట్రాలకు ఇచ్చే సాయంలో 30 శాతం ఈ ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు, మిగిలిన 70 శాతం ఇతర రాష్ట్రాలకు ఇస్తుంది. ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు కూడా ఎంత అంటే అంత ఇవ్వరు. వాటి వార్షిక ప్రణాళిక సైజు, అందులో ఖర్చు చూసి దాని ప్రకారమే ఇస్తారు. అయితే, అలా ఇచ్చే మొత్తంలో 90 శాతం గ్రాంటుగా ఇస్తారు. మిగిలిన రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే సాయంలో కేవలం 30 శాతం మాత్రమే గ్రాంటుగా ఉంటుంది. వివిధ పద్దుల కింద ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు, ఇతర రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో తేడా ఇలా ఉంటుంది.
90 శాతం గ్రాంటు వస్తే..!?
నవ్యాంధ్రకు 90 శాతం గ్రాంటు ఇచ్చినా భారీగా నిధులు రావని అధికార వర్గాలు చెబుతున్నాయి. 90 శాతం గ్రాంటుగా ఇస్తున్న ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఉదాహరణకు, 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం ఈ రెండు రకాల రాష్ట్రాలకు కలిపి తన బడ్జెట్‌లో రూ.57,575 కోట్లు కేటాయించింది. ఇందులో ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు రూ.17 వేల కోట్లు కేటాయించింది. ఇందులో 90 శాతం గ్రాంటు కింద ఆ 11 రాష్ట్రాలకు కేవలం రూ.15 వేల కోట్లు మాత్రమే ఇచ్చింది. ఇతర రాష్ట్రాలకు 30 శాతం గ్రాంటు కింద రూ.40 వేల కోట్లు ఇచ్చింది. అదే ఏడాది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వార్షిక ప్రణాళికను రూ.53 వేల కోట్లుగా నిర్థారించింది. నవ్యాంధ్రకు ఆ ప్రణాళిక రూ.27 వేల కోట్లుగా ఉంటుందని అంచనా. నవ్యాంధ్రకు ప్రత్యేక కేటగిరీ హోదా ఇస్తే, ఈ ప్రణాళిక సైజు, కేంద్రం లెక్కల ప్రకారం 90 శాతం గ్రాంటు కింద రాష్ట్రానికి వచ్చే సాయం రూ.5600 కోట్లు మాత్రమే ఉంటుందని అంచనా. దీనికన్నా విదేశీ రుణ ప్రాజెక్టులకింద ఎక్కువ సాయం వచ్చే అవకాశం ఉందని ఏపీ ఆర్థిక శాఖ అంచనా. ఆసియా అభివృద్ధి బ్యాంక్‌, జపాన్‌కు చెందిన జైకా, ప్రపంచ బ్యాంక్‌ వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి రాష్ట్రానికి వచ్చే రుణ సహాయంలో కూడా తొంభై శాతం గ్రాంటుగా వస్తుంది. విదేశీ రుణ ప్రాజెక్టులు కూడా కేంద్రం ఆమోదిస్తేనే వస్తాయి. కేంద్రాన్ని ఒప్పించి ఈ రుణ ప్రాజెక్టులను ఎంత ఎక్కువ తెచ్చుకోగలిగితే రాష్ట్రానికి అంత ఉపయోగం ఉంటుందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. అలాగే, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన ఏఐబీపీ పథకం కింద కూడా ప్రత్యేక హోదా ద్వారా కొంత లాభం పొందే అవకాశం ఉందన్నది ఆ వర్గాల అంచనా. నీతి ఆయోగ్‌ ఆమోదం పొందిన మేజర్‌, మీడియం ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఈ పథకం కింద కేంద్రం నిధులు ఇస్తుంది. ఇప్పటికే నిర్మాణం మొదలై వచ్చే నాలుగేళ్లలో పూర్తి చేయడానికి అవకాశం ఉన్న సాగునీటి పథకాలకు ఈ నిధులు ఇస్తారు. ప్రత్యేక హోదా వస్తే ఇవి కూడా 90 శాతం గ్రాంటుగా వస్తాయి. అయితే, ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని, దాని బదులు ఆ పేరుతో ఆర్థిక ప్రయోజనాలు ఇస్తామని కేంద్రం చెబుతున్న విషయం తెలిసిందే.

Monday, 24 August 2015

ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ

ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ

న్యూఢిల్లీ, ఆగస్టు 25 : ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం ఉదయం సమావేశమయ్యారు. ఏపీకి ప్రత్యేకహోదా, ప్రత్యేక ప్యాకేజీపై చర్చకొనసాగుతోంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ కూడా ఈ భేటీకి హాజరయ్యారు. అయితే విభజన హామీలను నెరవేర్చాలని బాబు ప్రధాని దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. ఏపీలో పారిశ్రామికాభివృద్ధి, పోలవరం ప్రాజెక్టులపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. ఏపీ ఆర్థికంగా నిలదొక్కకునేంత వరకూ సాయం చేయాలని ప్రధానిని చంద్రబాబు కోరినట్లు సమాచారం.
 
అంతకుముందు కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, రాజ్‌నాథ్ సింగ్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీని అన్ని విధాలుగా ఆదుకుంటామని సమావేశం అనంతరం రాజ్‌నాథ్ తెలిపారు. హోదాను రాజకీయం చేయడం తగదని వెంకయ్య అన్నారు. తెలుగువాడిగా రాష్ట్రానికి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. విభజన చట్టం అమలయ్యేలా చూడాలని హోంమంత్రిని కోరామని వెంకయ్య తెలిపారు.

రాజకీయ పార్టీలు ఆర్టీఐ కిందకు రాబోవు

రాజకీయ పార్టీలు ఆర్టీఐ కిందకు రాబోవు

న్యూఢిల్లీ, ఆగస్ట్ 24: రాజకీయ పార్టీలు ఆర్టీఐ కిందకు రాబోవని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. రాజకీయ పార్టీలు ప్రభుత్వ సంస్థలు కావని స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలు కనుక ఆర్టీఐ కిందకు వస్తే వాటి పనితీరు దెబ్బతింటుందని తెలిపినట్లు సమాచారం. రాజకీయ ప్రత్యర్ధులు దురుద్దేశంతో ఆర్టీఐ అప్లికేషన్లు దాఖలు చేసే అవకాశం ఉందని వెల్లడించింది. రాజకీయ పార్టీలను సమాచారహక్కు కిందకు తెస్తే ఆర్ధిక అవకతవకలకు చెక్ పెట్టినట్లౌతుందని చాలా కాలంగా ఆర్టీఐ కార్యకర్తలు కోరుతున్నారు. ఎన్నికల్లో అవినీతి, అక్రమాలు తగ్గిపోతాయనే వాదన కూడా ఉంది. 20 వేల కంటే తక్కువగా తీసుకున్న విరాళాల వివరాలను కూడా ప్రజల ముందుంచాలని ఆర్టీఐ కార్యకర్తలు కోరుతున్నారు. ఈ తరుణంలో రాజకీయ పార్టీలను సమాచార హక్కు కిందకు తీసుకురాలేమని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. 

బీజేపీ మద్దతుతోనే ఏపీ గొంతు కోశారు

బీజేపీ మద్దతుతోనే ఏపీ గొంతు కోశారు
ఎన్నికల్లో పోటీ చేయను : ఉండవల్లి

హైదరాబాద్, ఆగస్టు 24: కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిపై ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర విభజనలో బీజేపీ పాత్ర కూడా ఉందని ఉండవల్లి ఉద్ఘాటించారు. అయితే ఈ విభజనలో తన పాత్రేమీ లేనట్టు వెంకయ్య మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీ రెవెన్యూ లోటు భర్తీ చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో ఉందని, ఆ మేరకు రెవెన్యూ లోటును కేంద్రమే త్వరగా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలోని హామీలు ఏమయ్యాయని నిలదీశారు. బీజేపీ మద్దతుతోనే పార్లమెంట్‌లో విభజన బిల్లు ఆమోదం పొందిందని, ఆ పార్టీ మద్దతుతోనే ఏపీ గొంతుకోశారని ఉండవల్లి నిప్పులు చెరిగారు. నాడు రాజ్యసభలో వెంకయ్య మాటలు విన్నవారంతా ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని నమ్మకంతో ఉన్నారన్నారు. పార్లమెంట్ రూల్స్ ప్రకారం విభజన బిల్లు పాస్ కాలేదని అన్నారు. పాస్‌కాని బిల్లును ఎలా అమలు చేస్తారంటూ సుప్రీంకు కూడా వెళ్లామని ఉండవల్లి చెప్పారు. అయితే దీనిపై ప్రభుత్వం ఎందుకు కౌంటర్ దాఖలు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేస్తే ధర్మాసనం ఎదుట తమ వాదనలు వినిపిస్తామని ఉండవల్లి ఉద్ఘాటించారు

రాష్ట్రాభివృద్ధికి అన్నివిధాల సహకరిస్తాం : రతన్ టాటా

రతన్ టాటా రాక పెట్టుబడులకు సూచిక : బాబు
రాష్ట్రాభివృద్ధికి అన్నివిధాల సహకరిస్తాం : రతన్ టాటా

విజయవాడ, ఆగస్టు 24: రతన్ టాటా రాకతో రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావారణం ఏర్పడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో వనరులకు కొదవ లేదని, పరిశ్రమల స్థాపనకు వ్యాపారవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సోమవారం ఇక్కడి గేట్‌వే హోటల్లో రతన్ టాటాతో పాటుగా పలువురు దేశీయ పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో టాటా ట్రస్టు దత్తత తీసుకున్న విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 264 గ్రామాల అభివృద్ధిపై రూపొందించిన ప్రణాళికలను సీఎం చంద్రబాబు, రతన్ టాటా విడుదల చేశారు. దీంతో పాటుగా రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపన తదితర అంశాలపైనా సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) కింద లోక్‌సభ నియోజకవర్గాన్ని దత్తత తీసుకోవడం దేశ చరిత్రలోనే ప్రథమం అని, దానికి విజయవాడ నాంది కావడం గర్వకారణం అని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రతన్ టాటా లాంటి వారి సలహాలు ఎంతగానో అవసరం అన్నారు. అమరావతి నిర్మాణ దశలో రతన్ టాటా రాష్ట్రానికి రావటం ఎంతో సంతోషం అని అన్నారు. ప్రపంచంలోనే విలువలనున్న వ్యాపారవేత్త రతన్ టాటా అని, వ్యాపారానికి వన్నె తచ్చిన వ్యక్తి అని సీఎం కొనియాడారు. దేశంలోని వ్యాపార వేత్తలకు ఆదర్శవంతమైన వ్యక్తి రతన్ టాటా అని ప్రశంసలు గుప్పించారు. రతన్ టాటా విజయవాడకు రావటం సంతోషమని.. విశాఖ, చిత్తూరు ప్రాంతాలకూ రావాలని కోరారు. రాష్ట్రంలో ఆక్వా, మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల అభివృద్ధికి టాటా ప్రోత్సాహం కావాలని సీఎం కోరారు. అదేవిధంగా రాష్ట్రంలో ఖనిజ నిక్షేపాలకు కొదవే లేదని, ఈ నేపథ్యంలో ఖనిజ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు టాటా సంస్థ ముందుకు రావాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

వివిధ రంగాల వారు గ్రామాలను దత్తత తీసుకోవాలని తాను ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పటి వరకు 10 వేల గ్రామాలు దత్తత తీసుకున్నారని, ఇంకా ఆరు వేల గ్రామాల దత్తతకు ఎన్‌ఆర్‌ఐలు, కార్పొరేట్‌ సంస్థలు ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఏపీ చరిత్రలో ప్రభుత్వం ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం ఇది అని బాబు చెప్పారు. టాటా ట్రస్టు రాష్ట్రంలోని 10 లక్షల జనాభాకు సంబంధించిన సంపూర్ణ వివరాలు సేకరించిందని, ఈ ట్రస్టుతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ఎంతో విలువైనదని సీఎం పేర్కొన్నారు. రతన్ టాటాతో తనకున్న సాన్నిహిత్యంతో రాష్ట్రంలో ఇంక్యూబేషన్ కంపెనీలను ప్రమోట్ చేయాలని కోరానన్నారు. ఇందుకు ఆయన పూర్తిగా సానుకూలత వ్యక్తం చేశారని రతన్ టాటాకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఇంటికో కంప్యూటర్ లిటరేట్, ఔత్సాహిక పారిశ్రామికవేత్త ఉండేలా చూస్తామని చెప్పారు. ఏపీలో పరిశ్రమలకు నిరంతర విద్యుత్, సింగిల్ డెస్క్ పాలసీ, భూములు, నీరు ఆకర్షణీయ అంశాలని వివరించారు.
 
ఇంతకు ముందు మాట్లాడిన రతన్ టాటా.. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి చేస్తున్న కృషిని అభినందించారు. ఏపీలో పారిశ్రామికాభివృద్ధికి చంద్రబాబు కృషి ప్రశంసనీయమని రతన్ టాటా కొనియాడారు. స్వయం కృషితో దేన్నైనా సాధించగల వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. రాష్ట్రంలో ఫిసరీస్, ఆక్వారంగాల్లో టాటా సహకరిస్తుందని రతన్ టాటా చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్‌గా నిలుస్తుందన్నారు. ఏపీతో ఎంవోయూ కుదుర్చుకోవడం సంతోషమన్న ఆయన రాష్ట్రాభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.

Wednesday, 19 August 2015

ఆ నీటిలో ఏపీకి వాటా లేదు..చుక్క కూడా ఇవ్వలేం

ఆ నీటిలో ఏపీకి వాటా లేదు..చుక్క కూడా ఇవ్వలేం

హైదరాబాద్‌, ఆగస్టు19(ఆంధ్రజ్యోతి): నాగార్జున సాగర్‌ నుంచి కృష్ణాడెల్టాకు తాగునీరు చుక్కు కూడా ఇవ్వలేమని, సాగర్‌ రిజర్వాయర్‌లో ప్రస్తుతం నిల్వ ఉన్న నీటిలో ఏపీకి ఎలాంటి వాటా లేదని కృష్ణా బోర్డుకు తెలంగాణ నీటిపారుదల శాఖ స్పష్టం చేసింది. కృష్ణా డెల్టాకు తాగునీటిని విడుదల చేయాలంటే.. శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి ఏపీ విడుదల చేస్తే సాగర్‌ నుంచి తాము విడుదల చేస్తామని తేల్చి చెప్పింది. కృష్ణా డెల్టాకు తాగునీటి అవసరాల నిమిత్తం 3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఆదేశించిన బోర్డుకు తెలంగాణ నీటిపారుదల శాఖ పైవిధంగా సమాధానం చెప్పింది. శ్రీశైలం రిజర్వాయర్‌లో 803 అడుగుల వద్ద నుంచి దిగువకు దాదాపు 17-18 టీఎంసీల నీరు లభిస్తుందని, ఆ నిల్వ నుంచి మూడు టీఎంసీలను ఏపీ జల వనరుల శాఖ విడుదల చేస్తే, ఆ మేరకు తాము సాగర్‌ నుంచి కృష్ణా డెల్టాకు విడుదల చేస్తామని బోర్డుకు తెలిపింది. కాగా.. సెప్టెంబర్‌ రెండో వారంలోగా కృష్ణానదికి వరదలు వచ్చి శ్రీశైలం, సాగర్‌ రిజర్వాయర్లు నిండితేనే రెండు రాష్ర్టాలకు నీటి కరువు తీరుతుంది. లేదంటే, శ్రీశైలంలో 803 అడుగులకు దిగువన ఉన్న 17-18 టీఎంసీలు, సాగర్‌లో 509 అడుగులకు దిగువన ఉన్న 130 టీఎంసీల నీటిని ఇరు రాష్ర్టాలు వాడుకోవాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో తాగునీటి కోసం రెండు రిజర్వాయర్లను ఖాళీచేయడం మినహామార్గం లేదని రెండు రాష్ర్టాల నీటి పారుదల శాఖ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. శ్రీశైలం కంటే కూడా సాగర్‌ నిల్వల వాడ కంపైనే తీవ్ర వత్తిడి వస్తుందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. శ్రీశైలంలో 800 అడుగులకు దిగువకు వెళితే బురద నీరు వస్తుందని, ఆ నీటిని తాగునీటి అవసరాల నిమిత్తం వాడుకోవడం కష్టమని తెలిపాయి. దీంతో సాగర్‌లోని డెడ్‌స్టోరేజ్‌లో ఉన్న నీటిని మాత్రమే తాగునీటి అవసరాలకు వాడుకోవాల్సిన అగత్యం ఏర్పడుతుందని పేర్కొన్నాయి. చివరకు హైదరాబాద్‌ తాగునీటి అవసరాలను తీర్చే అక్కంపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు నీటిని తెచ్చే ఏఎంఆర్‌పీ లిఫ్ట్‌ స్కీం పని చేయాలంటే.. దాని అప్రోచ్‌ ఛానల్‌కు సాగర్‌ రిజర్వాయర్‌ నుంచి ప్రత్యేక పంపుల ద్వారా పంపింగ్‌ చేయాల్సి ఉంటుందని ఆ వర్గాలు వివరించాయి. సాగర్‌ ఎడమ కాల్వ, కుడి కాల్వ తాగునీటి అవసరాలు, కృష్ణా డెల్టా తాగునీటి అవసరాలను తీర్చాలంటే రిజర్వాయర్‌ లెవెల్స్‌ను 450 అడుగుల వరకు వినియోగించాల్సి వస్తుందని పేర్కొన్నాయి.