Wednesday 2 April 2014

ఒక కుటుంబం .. ఒకే టికెట్!

ఒక కుటుంబం .. ఒకే టికెట్!

Published at: 02-04-2014 07:55 AM
బంధువులకూ నో చాన్స్
స్పష్టం చేసిన సోనియా
ఉత్తమ్ భార్యకు కోదాడ టికెట్ నిరాకరణ
పొన్నాల కోడలికి కూడా.. ఈ సారి సబిత దూరమే
(హైదరాబాద్-ఆంధ్రజ్యోతి) :ఒక కుటుంబానికి ఒకే టికెట్ అనే సూత్రాన్ని నిక్కచ్చిగా అమలు చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. సోమవారం నాడు ఢిల్లీలోని కాంగ్రెస్ వార్ రూమ్‌లో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సమక్షంలో జరిగిన సమావేశంలో టీపీసీసీ ప్రతిపాదించిన లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను సమీక్షించారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా కోదాడ అసెంబ్లీ నియోజకవర్గంపై చర్చ జరిగింది. ఇక్కడినుంచి టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమకుమార్‌రెడ్డి భార్య పద్మ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒక్కరే దరఖాస్తు చేశారు. అయితే.. ఉత్తమ్‌కు టికెట్ ఇస్తున్నందున ఆయన కుటుంబం నుంచే మరొకరికి టికెట్ ఇవ్వరాదని సోనియా స్పష్టం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కోడలికి కూడా టికెట్ ఇవ్వరాదన్న నిర్ణయాన్ని ప్రకటించారు. చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌కు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో.. సబితా ఇంద్రారెడ్డికి అవకాశం లేనట్లే. నిజామాబాద్ రూరల్ నుంచి పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్‌కు మార్గం సుగమమయింది. కామారెడ్డిలో మాజీ మంత్రి షబ్బీర్ అలీకి కూడా దాదాపు లైన్ క్లియర్ అయినట్లేనని చెబుతున్నారు. తొలి జాబితాలో సిటింగ్‌లందరికీ మళ్లీ పోటీచేసే అవకాశం ఇవ్వాలన్న సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చారు. కామారెడ్డి నుంచి షబ్బీర్ అలీ పేరును మొదట క్లియర్ చేసిన సోనియాగాంధీ.. ఆయన సేవలను ప్రచారానికి వినియోగించుకోవాల్సి ఉన్నందున పెండింగ్‌లో ఉంచాల్సిందిగా సూచించారని అంటున్నారు. సోనియాతో జరిగిన సమావేశంలో.. అభ్యర్థుల ఎంపిక విషయంలో మాజీ మంత్రి జానారెడ్డి కీలక భూమిక పోషించారని పార్టీ నేతలు చెబుతున్నారు. సీపీఐ పొత్తు వ్యవహారం కూడా దాదాపు తేలిపోయినట్లేనని అంటున్నారు.
ఉత్తమ్ పరేషాన్.. అంజన్ ఆందోళన: ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణికి, పొన్నాల కోడలుకు అధిష్ఠానం సీట్లు కోరుతూ అధిష్ఠానానికి వారు ఎన్ని ప్రతిపాదనలు పంపినప్పటికీ పెద్దలు పరిగణించకపోవడంతో వార్దిద్దరూ ఆందోళనలో ఉన్నారు. 'మీకు మొత్తం పార్టీ బాధ్యతలు అప్పజెప్పితే మీ సొంత ఎజెండాలకే ప్రాధాన్యం ఇవ్వడం సరైంది కాద'ని పార్టీ నేత ఒకరు వారికి గట్టిగా చెప్పినట్లు సమాచారం. మరోవైపు తన నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా తాను సూచించిన వాళ్లను కాక వేరే వాళ్లను ఎన్నుకునే ప్రయత్నాల పట్ల సికింద్రాబాద్ ఎంపిీ అంజన్ కుమార్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంబర్‌పేట నుంచి తాను సూచించిన వి హనుమంతరావుకు సీటు నిరాకరించడం, మరో స్థానంలో తాను కోరిన అభ్యర్థికి కాకుండా దామోదర రాజనర్సింహ శిష్యుడు సుధాకర్ యాదవ్‌కు సీటు కేటాయించడంపై అంజన్ వర్గీయులు ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది. అయితే, మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి సూచనల మేరకే ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు తెలిసింది.
పొన్నాలకు విలువే లేదు!: అధిష్ఠానం వద్ద తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాటకు విలువ లేదని, మొత్తం రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచందర్ రావు నిర్ణయిస్తున్నారని వీహెచ్ సన్నిహితులు విమర్శిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో కేవీపీయే జోక్యం చేసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. జైపాల్‌తో సహా సిట్టింగ్ ఎంపీలు అందరూ తమ నియోజకవర్గాల్లో గెలుపుపై దృష్టి సారించినందువల్ల ఢిల్లీ రాజకీయాల గురించి పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.

No comments:

Post a Comment