Thursday, 2 January 2014

ఆరు నూరైనా తెలంగాణ ఆగదు - KCR

ఆరు నూరైనా తెలంగాణ ఆగదు

Published at: 03-01-2014 05:18 AM

 2  2  0 

 



ఆట ముగిసింది..అంతిమ విజయం తెలంగాణదే
బిల్లు పాస్ కావడానికి సాధారణ మెజారిటీ చాలు
సీఎంకు పరమ దుర్మార్గ, కిరాతక బిరుదు ఇవ్వాలి
రాష్ట్రం వచ్చాక కిరణ్,బాబు,జగన్లకు సత్కారం:కేసీఆర్
హైదరాబాద్, జనవరి 2 : ఆరు నూరైనా, సీఎం కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబు అసెంబ్లీకి మోకాళ్లపై నడిచి వెళ్లినా రాష్ట్ర విభజనను ఆపలేరని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కుండ బద్దలు కొట్టారు. "ఆట ముగిసింది. అంతిమ విజయం తెలంగాణదే. మిగిలిందల్లా బిల్లులో సవరణలు చేయించుకోవడమే. అందుకు అందరం కలిసి ఢిల్లీకి వెళదాం. రాయల తెలంగాణను అడ్డుకోవడంలో విజయం సాధించినట్లే బిల్లులో సవరణలు సాధించుకుందాం'' అని కేసీఆర్ పిలుపునిచ్చారు. నాంపల్లిలోని గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం కార్యాలయ ఆవరణలో గురువారం సంఘ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. ఇప్పుడు తెలంగాణ విడిపోతే తమ పరిస్థితి ఏమిటని సీమాంధ్రవారు అంటున్నారని, మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పటి నుంచే తెలంగాణను కబళించడానికి కుట్రలు ప్రారంభమయ్యాయని చెప్పారు. "ఇప్పుడు మాట్లాడుతోన్న కిరణ్ కొత్తోడు కాడు. పాతోడే. అందుకే లంకలో పుట్టినోళ్లంతా రాక్షసులే అని నేను అప్పుడే చెప్పా. జయప్రకాశ్ నారాయణ్, చంద్రబాబు, కిరణ్.. వీరందరి రంగులు బయటపడిపోయాయి. అందరూ తెలంగాణను దోపిడీ చేయాలనుకునేటోళ్లే. రాష్ట్రం విడిపోతే మాకు లోటు బడ్జెట్ అవుతుందని కిరణ్ చెబుతుండు.
అంటే విడిపోతే అడుక్కు తిందామని, విడిపోకపోతే దొబ్బి తిందామనా?'' అని మండిపడ్డారు. తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, ఫిబ్రవరి మొదటి వారంలో తెలంగాణ బిల్లును తప్పనిసరిగా పార్లమెంటులో పాస్ చేయిస్తామని బీజేపీ అగ్రనేత ఆడ్వాణీ స్పష్టం చేశారని, అధికార పక్షం, ప్రతిపక్షం అనుకున్నాక తెలంగాణను ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. "పార్లమెంటులో బిల్లు పాస్ కావాలంటే మూడింట రెండు వంతుల మెజారిటీ కావాలంటున్నారు. కానీ, అది అవసరం లేదు. 55 మంది సభకు వస్తే కోరం ఉన్నట్లు భావించి సభను నడిపిస్తారు. ఈ 55 మంది సభ్యుల్లో 28 మంది ఓటేసినా.. సాధారణ మెజారిటీలో బిల్లు పాస్ అయిపోతుంది. ఇప్పటికే 33 పార్టీలతో మాట్లాడా. ఒక్క సీపీఎం, సమాజ్‌వాదీ తప్ప అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయి. ఇప్పటికే పార్లమెంటుకు వెళ్లినప్పుడల్లా చాలా మంది ఇతర పార్టీల నేతలు 'క్యా రావ్ సాబ్! తుమారా తెలంగాణ క్యా హువా?' అని ప్రశ్నిస్తున్నారు. నేను చెబుతున్నా.. ఏ బిల్లుకు రానంత అత్యధిక మెజారిటీతో రాష్ట్ర విభజన బిల్లు పాస్ అవుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం, శాసనసభ కూడా బిల్లును ఆపలేవు'' అని తెలిపారు. ఆర్టికల్ -3 గురించి ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారని, రాష్ట్రాల విభజన సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వానికి నియంతృత్వం ఉండకూదన్న ఉద్దేశంతో అంబేద్కర్ అసెంబ్లీ అభిప్రాయాన్ని తెలుసుకోవాలన్న క్లాజు పెట్టారని చెప్పారు. "ఈ అంశంపై అంబేద్కర్ రాత్రి 12 గంటల వరకు నిద్ర పోకుండా ఆలోచించి ఒక నోట్‌ను తయారు చేసి మిగతా సభ్యులకు చూపించారు. వారందరూ ఒప్పుకొన్నారు. రాష్ట్రాల్లో ఉప ప్రాంతాలు ఉంటాయని, ఒకానొక సందర్భంలో ఆ స బ్ రీజియన్ ప్రజలు కష్టపడితే ఉద్యమాలకు దిగే అవకాశం ఉందని అంబేద్కర్ యోచించారు. చివరకు అవి దేశంలో అంతర్యుద్దాలకు దారి తీస్తాయన్న ఆందోళనతో.. రాష్ట్రాల విభజన అధికారాలు కేంద్రం వద్దే ఉండాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఆర్టికల్-3ని రాజ్యాంగంలో జొప్పించారు. మరికొంత మంది కోర్టుల ప్రస్తావన తెస్తున్నారు. మహారాష్ట్ర నుంచి గుజరాత్ విడిపోయినప్పుడు ముంబైని గుజరాత్ వాళ్లు అడిగారు. కోర్టుకు కూడా వెళ్లారు. కానీ విభజనపై సంపూర్ణ అధికారం కేంద్రానిదేనని కోర్టు స్పష్టం చేసింది. ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు తెలంగాణను ఎవరూ ఆపలేరు. 23 తర్వాత పార్లమెంటుకు బిల్లు పంపించక తప్పదు. పార్లమెంటులో బిల్లు పాసయ్యాక సీఎం కిరణ్ పిల్లిమొగ్గలేస్తాడో, ఏడుస్తాడో, చంద్రబాబు ఏడుస్తాడో వారిష్టం'' అని అన్నారు.
కిరణ్.. ఏం చూస్తావ్!?: "సీఎం కిరణ్ ఈ విషయాలన్నీ చదువుకోడా? నా అంత సిపాయి లేడన్నట్లు మాట్లాడుతుండు. చిటికెన వేలు గోరంత కాడు కిరణ్. ఆయన ఎన్ని ప్లాన్లు వేసినా.. ఆయన అయ్య జుట్టులోకి వెళ్లేంత ప్లాన్ మాకుంది. కిరణ్ పని అయిపోయింది. జనవరి 23 వరకు ఆయన బ్రాకెట్‌లో ఉన్నాడు. ఏదో చూస్తానంటున్నాడు. క్యా దేక్తా, కిదర్ దేక్తా? నీతోని ఏం కాదు. తమిళనాడు నుంచి మీరు ఎలా కొట్లాడి బయటకు వచ్చారో ఒకసారి చరిత్ర చూడండి. అప్పుడు మీరు మైనారిటీలో ఉండి, తమిళనాడు వాళ్లు మెజారిటీలో ఉన్నారు. వాళ్ల ఎమ్మెల్యేలే ఎక్కువ మంది ఉన్నారు. మీరు చెప్పే సూత్రం ప్రకారం తెలంగాణ ఇవ్వాలి కదా. కిరణ్‌కు ఆమాత్రం ఇంగిత జ్ఞానం లేదా? ఏం చదివాడు. బీకాం చదివాడా? ఆయన కుర్చీకైనా గౌరవమివ్వడం లేదు. చాలా దుర్మార్గుడు. ఆయనకు పరమ దుర్మార్గ కిరాతక బిరుదు ఇవ్వాలి. తెలంగాణ వచ్చాక కిరణ్, బాబు, జగన్‌లకు సత్కారం చేసి పంపాలి. అది మరిచిపోలేని విధంగా ఉండాలి'' అని కేసీఆర్ అన్నారు.
అప్రమత్తంగా ఉందాం
తెలంగాణ బిల్లులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, దానిలో సవరణల కోసం అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ చెప్పారు. "జనాభా నిష్పత్తి ప్రకారం ఉద్యోగులు, పెన్షనర్లను విభజిస్తామంటున్నారు. దీనిని ఒప్పుకోవద్దు. ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోద ముద్ర వేశాక కూడా లగడపాటి ఇంకా విభజనను ఆపుతామని చెప్పాడు. అలాంటి వారి ఆశలన్నీ పటాపంచలయ్యాయి. రాయలసీమ జిల్లాలను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తామన్న ప్రతిపాదన వచ్చింది. కానీ విద్యార్థులు రోడ్లపైకి రావడంతో సోనియా గాంధీ ఆ నిర్ణయాన్ని పక్కకు పెట్టండని చెప్పారు'' అని వివరించారు. త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాలని, అందరం కలిసి ఢిల్లీకి వెళదామని, బిల్లులో సవరణలు చేయించుకోవడానికి కేంద్ర పెద్దలను కలిసి వివరిద్దామని చెప్పారు. "శుక్రవారం జానారెడ్డి, ఈటెల ఆధ్వర్యంలో తెలంగాణలోని అన్ని పార్టీల ఎమ్మెల్యేలు సమావేశమవుతారు. అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలో నిర్ణయిస్తారు. తెలంగాణ కోసం మళ్లీ లడాయి అవసరమైతే నేను చచ్చిపోయానా? యుద్ధం చేయాల్సి వస్తే అందరం ఒక్కటై చేద్దాం. జానారెడ్డి, నేను ఇప్పటికీ కలిసే ఉన్నాం'' అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
- See more at: http://www.andhrajyothy.com/node/49755#sthash.Qho7w2QO.dpuf


ఆరు నూరైనా తెలంగాణ ఆగదు

Published at: 03-01-2014 05:28 AM
 New  0  0 
 
 

అధికారపక్షం,ప్రతిపక్షం అనుకున్నాక
ఎవరూ ఆపలేరు
కిరణ్, బాబు మోకాళ్లపై అసెంబ్లీకి నడిచి వెళ్లినా ఆపలేరు
సీఎంకు పరమ దుర్మార్గ,కిరాతక బిరుదు
జనవరి 23 వరకూ బ్రాకెట్లో ఉన్నాడు
రాష్ట్రం వచ్చాక కిరణ్,బాబు,జగన్‌కు 'సత్కారం' చేద్దాం : కేసీఆర్
హైదరాబాద్, జనవరి 2 : త్వరలో ఏర్పాటయ్యే తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవెల్లి గ్రామంలోని తన ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై కేవలం రైతులకే కాకుండా, యువతకు, విద్యార్థులకు విశ్వాసం కలిగేలా చేస్తామని చెప్పారు. తెలంగాణలో సమశీతోష్ణ వాతావరణ పరిస్థితులు, నాలుగు (ఎర్ర, నల్ల, తేలికపాటి, ఇసుక) రకాల నేలలు, సరిపడా వర్షపాతం ఉన్నందున.. విద్యార్థులు సైతం వ్యవసాయంలో అడుగుపెట్టేలా ఆ రంగానికి ప్రాధాన్యం ఉంటుందన్నారు.
ప్రస్తుత ప్రభుత్వాలు గ్రీన్ హౌస్ సాగుకు ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇవ్వట్లేదని కేసీఆర్ విమర్శించారు. తాము మాత్రం గ్రీన్ హౌస్ సాగును బాగా ప్రోత్సహిస్తామని వెల్లడించారు. ఇందుకోసం తెలంగాణలోని 10 జిల్లాల్లో జిల్లాకు 20 చొప్పున 200 గ్రామాలను ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా గ్రీన్‌హౌస్ సాగును అమలు చేయిస్తామని చెప్పారు. "ఇక్కడి వాతావరణ పరిస్థితులు విత్తన ఉత్పత్తికి అనుకూలం. రాష్ట్ర విభజన జరిగితే విత్తన ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్‌గా నిలుస్తుంది. ఈ విషయాన్ని వ్యవసాయ రంగ నిపుణులే చెబుతున్నారు'' అన్నారు. ఈ ఏర్పాట్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెద్దపీట వేస్తామన్నారు. ప్రతి దళిత కుటుంబానికీ 3 ఎకరాల భూమి ఇస్తామని తాము ఉత్తగనే చెప్పలేదని, సాగునీరు సహా అన్ని వసతులను అందులో కల్పిస్తామని చెప్పారు. కేసీఆర్ చెప్పిన మిగిలిన అంశాలు ఆయన మాటల్లోనే..
మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవెల్లి గ్రామంలో మా అబ్బాయికి (సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్) 30 ఎకరాలు, నాకు 29-30 ఎకరాల భూమి ఉంది. చాలా ఏళ్ల క్రితం జహంగీర్ అనే నా క్లాస్‌మేట్ కొనమంటే ఇక్కడ భూమి కొన్నాను. తర్వాత రాము (కేటీఆర్) అమెరికా నుంచి వచ్చాక ఇక్కడే భూమి కొన్నాడు. మేం కొన్నప్పుడు ఎకరా ధర రూ.1లక్ష నుంచి 1.5 లక్షల వరకు ఉండేది. ఇప్పుడు ఎకరా రూ.5 లక్షల ధర పలుకుతోంది. చాలా కాలం భూమిని ఖాళీగానే పెట్టాం. ఒకసారి ఇటువైపు వచ్చినప్పుడు నాతో ఉన్న పార్టీ నేత నాయిని నర్సింహారెడ్డి..'ఎందుకన్నా.. భూమి ఖాళీపెడ్తావ్.. పొతం చేసి ఏదన్న పంట వేయచ్చు కదా?' అని అన్నారు. దాంతో సిద్దిపేటకు చెందిన మా పిలగాడు పరమేశ్వర్.. భూమి పొతానికి ముందుకు వచ్చాడు. మూడేళ్ల కిందట మొదట ఆనపకాయ సాగు చేస్తే, దండిగా కాసింది. ఒక్క వరుసలో 2వేల కాయలు కాశాయి.
ఎకరాకు రూ.18-20 లక్షలు వచ్చాయి. నాలుగు ఎకరాల్లో ఆలుగడ్డలు సాగు చేస్తే రూ.6 లక్షల రాబడి వచ్చింది. మొక్కజొన్న సాగు చేస్తే వెయ్యి క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పది ఎకరాల్లో కాకరకాయ వేస్తే ఎకరాకు రూ.7-8 లక్షల లాభం వచ్చింది. కొంత విస్తీర్ణంలో పసుపు పంటను సాగు చేశాం. మొత్తంమ్మీద రూ.1.5-2 కోట్ల లాభాలు వచ్చాయి. ఇది తొలి ఏడాదిన్నర, రెండేళ్లలో జరిగిన ప్రక్రియ. దీంతో మొదట బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి తీసుకున్న రూ.43 లక్షల అప్పు తీరిపోయింది. మిగిలిన సొమ్ముతో..స్టాఫ్ క్వార్టర్లు కట్టించాం. పాడి గేదెలు కొనుగోలు చేశాం. మళ్లీ పంట పెట్టుబడిగా వినియోగించుకున్నాం. బ్యాంకు నుంచి తిరిగి రూ.3 కోట్ల రుణం తీసుకున్నాం. ఇప్పుడు రోడ్లు, గ్రీన్‌హౌస్ లేఅవుట్, ఇతర వసతుల ఏర్పాటుకు ఐదారు ఎకరాలు వదిలేశాం. నికరంగా 55 ఎకరాల్లో పంట సాగు చేపట్టాం. సాగునీటి కోసం ఎకరం విస్తీర్ణంలో 60 అడుగుల లోతుతో పెద్ద బావి తవ్వించాం. చుట్టుపక్కల నుంచి వర్షపు నీరంతా వృథా కాకుండా అందులోకి చేరుతుంది. బావిలోనే మూడు బోర్లు వేయించాం.
ఇప్పుడు బావిలో 45 అడుగుల మేర నీళ్లున్నాయి. దీంతో మా వ్యవసాయ క్షేత్రంతోపాటు, చుట్టుపక్కల కూడా భూగర్భ జలాలు పెరిగాయి. ఆరు బోర్లు కూడా వేయించాం. 9 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన సంప్ నిర్మించాం. ప్రస్తుతం 45 ఎకరాల విస్తీర్ణంలో ఆలుగడ్డ సాగు చేశాం. మరో 10 ఎకరాల్లో గ్రీన్‌హౌస్ ఏర్పాటు చేసి నామ్‌దారి రకం కలర్ క్యాప్సికమ్ సాగు చేశాం. అందులో 60 శాతం రెడ్ క్యాప్సికమ్, 40 శాతం ఎల్లో క్యాప్సికమ్. కేవలం వర్షాధారంపై ఆధారపడితే ఇంత విస్తీర్ణంలో సమర్థంగా ఆలుగడ్డ, క్యాప్సికమ్ సాగు వీలయ్యేది కాదు. గట్ల వెంట 960 కొబ్బరి చెట్లు నాటాం. ఒక ఎకరం మామిడి తోట పెట్టాం. అంతర పంటగా కొత్తిమీర, పాలకూర, టమోటా, మిర్చి వేశాం. ప్రహరీ వెంట బీర, కాకర, ఆనపకాయ వేశాం. మొత్తం ఇక్కడ 22 కుటుంబాలు నిత్యం పనిచేస్తున్నాయి. మరో ఎనిమిది కుటుంబాలు రోజు బయటి నుంచి వచ్చి వెళ్తాయి. ఇక్కడ పండిన వరి ధాన్యాన్ని మిల్లింగ్ చేయించి బియ్యాన్ని పనిచేసే వారికి అందజేస్తున్నాం. ఇక్కడున్న వారికి ప్రతి రోజు అర లీటర్ పాలు ఇస్తున్నాం. ఆరోగ్య సమస్యలు వస్తే తీరుస్తున్నాం. వారి పిల్లలను స్కూల్‌కు పంపిస్తున్నాం.

విద్యాధికులూ సాగు చేయాలి
వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై సమాజంలో చిన్నచూపు ఉంది. పట్టభద్రుల్లో చాలా మంది పొలానికి వెళ్లటానికి ఇష్టపడటంలేదు. ఉద్యోగమే కావాలి..వ్యవసాయం చేయాలంటే పెట్టుబడి అవసరం అని ఆ రంగంపై దృష్టి సారించటంలేదు. కానీ ఆధునిక పద్ధతులు అనుసరిస్తూ..కన్సల్టెన్సీలను పెట్టుకొని వారిచ్చే సూచనలు పాటిస్తే వ్యవసాయం తప్పక లాభసాటే. ఈమధ్య బీహార్ రాష్ట్రం నలంద ప్రాంతానికి చెందిన రాకేష్ అనే రైతు ఎకరాకు 44.3 టన్నుల ఆలుగడ్డలు పండించి ప్రపంచ రికార్డు సాధించారు. సాగు పద్ధతులు మార్చుకోవటం వల్లనే ఇది సాధ్యమైంది. ఇప్పుడు డ్రిప్ పద్ధతిలో వరి కూడా పండిస్తున్నారు. సాధారణంగా ఎకరాకు సరిపోయే వర్షాధార, వరద నీరును డ్రిప్ ద్వారా అయితే ఐదున్నర, ఆరు ఎకరాల వరిని సాగులోకి తీసుకురావచ్చు. వ్యక్తిగతంగా రైతులను ప్రోత్సహిస్తే సోలార్ సిస్టమ్ వల్ల కూడా లాభం ఉంటుంది. సాల్విన్ అనే కంపెనీ మా క్షేత్రంలో ప్రచారం కోసం ఉచితంగా సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసి, ఒక బోర్‌వెల్‌ను అనుసంధానం చేసింది. ఇది సక్సెస్ అయ్యింది. మార్కెటింగ్ సదుపాయాలు సరిగా లేకపోవటం కూడా రైతులను నిరుత్సాహపరుస్తోంది.
నీళ్లు ఇలా పెడితే మేలు!
ఇజ్రాయిల్‌కి చెందిన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన రూ.15 లక్షల 'నెటాజెట్' పరికరాలు ఆటోమేటిక్ డ్రిప్ ఇరిగేషన్‌ను నిర్వహిస్తాయి. కంప్యూటర్ ద్వారా ప్రోగ్రామ్‌ను ఫిక్స్ చేస్తే..మొక్కలకు దశల వారీగా కావాల్సిన నీటిని, ఆ నీటిలో కరిగే ఎరువులు, ఇతర పోషకాలకు డ్రిప్ పద్ధతిలో అందిస్తుంది. దీంతో పంటలో మొదటి మొక్కకు ఎటువంటి పోషకాలు, నీరు అందుతాయో..చివరి మొక్కకు కూడా అంతే స్థాయిలో అందుతాయి. ఈ మధ్య ఇక్కడికి సాంగ్లీ నుంచి రైతులు వచ్చారు. ఒకేసారి ఎక్కువ నీళ్లు అందిస్తే, అందులో కలిసిన ఎరువులు పంటకు కాకుండా భూమిలోకి ఇంకిపోతాయని చెప్పారు. మొక్కలకు కావాల్సిన పోషకాలను ప్రతి రోజూ అందించాలని చెప్పారు. దాంతో నేను..'పంటకు ఒకేసారి ఎరువు వేస్తే సరిపోదా ?' అన్నాను. బదులుగా వారు..'ఆరు రోజులు తినే భోజనాన్ని ఒక్క రోజే తింటే ఎలా ఉంటుంది ?' అని ప్రశ్నించారు. అంటే సరైన పద్ధతులు పాటిస్తే వ్యవసాయమూ లాభసాటే!
నాయన వల్లే వ్యవసాయంపై ఆసక్తి
మా నాయన వ్యవసాయం చేసేవారు. ఆయన నుంచే నాకు వ్యవసాయంపై ఆసక్తి ఏర్పడింది. ఇప్పుడు దానినే వృత్తిగా ఎంచుకున్నా. మా నాయన వ్యవసాయం చేసేటప్పుడు వ్యవసాయ అధికారి సైకిల్‌పై తిరిగే వారు. మా ఇంటికి వచ్చి పంటలు ఎలా సాగు చేయాలో రెండు, మూడు రోజులు ఉండి మరి చెప్పి వెళ్లే వారు. మధ్యలో వచ్చి పంటల పరిస్థితి తెలుసుకొని, తగిన సూచనలు ఇచ్చే వారు. కానీ ఇప్పుడు ఏవోలు విత్తనాల పంపిణీ, ఎరువుల పంపిణీకి పరిమితమవుతున్నారు. విస్తరణ కార్యక్రమాలు కరువయ్యాయి. భవిష్యత్తు అవసరాలరీత్యా ఆహార రంగానికి దన్నుగా నిలవాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఆరోగ్యమైన తరంవస్తుంది. ఇందుకోసం ప్రభుత్వమే విత్తన ఉత్పత్తిని ప్రోత్సహించి, సేకరించి, దేశ వ్యాప్తంగా పంపిణీ చేయాలి. నేను వ్యవసాయం చేస్తుండటం వల్ల చుట్టుపక్కల రైతులు స్ఫూర్తి పొందుతున్నారు.
- See more at: http://www.andhrajyothy.com/node/49764#sthash.40PbQ4oS.dpuf

Wednesday, 1 January 2014

డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా! - BABU

డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా!

Published at: 02-01-2014 04:22 AM
 New  0  0 
 
 

ఆడపిల్ల భద్రతకు నాదీ పూచీ
ఆడబిడ్డలకు మాహాలక్ష్మీ పథకం
ఏడాదికి పది వంటగ్యాసు సిలిండర్లు
వితంతు మహిళలకు రూ.1000 పింఛన్
ఆధార్‌తో ఖాతాకు లింక్ తొలగిస్తా: బాబు
హైదరాబాద్, జనవరి 1  : తిరుపతి వేదికగా అనధికారంగా 'ఎన్నికల శంఖారావం' మోగించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అదే ఊపును కొనసాగిస్తున్నారు. రాష్ట్ర సమస్యలను, విభజన ప్రక్రియ కష్టాలను ఏకరువు పెడుతూనే..అధికారం ఇస్తే అమలు చేసే ప్రజా సంక్షేమ, సాధికారిక కార్యక్రమాల ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఈ క్రమంలో, రంగారెడ్డి జిల్లా కాటేదాన్ మధుబన్‌కాలనీలో బుధవారం జరిగిన మహిళా సదస్సులో ఆడపడుచుల అభిమానాన్ని చూరగొనేందుకు ప్రయత్నించారు. " నాది ఉడుంపట్టు. ఒకసారి మాటిస్తే వెనక్కిపోను. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువస్తే, ఆడపిల్ల భద్రతకు పెద్ద పీట వేస్తాం. డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తాం'' అని ప్రకటించారు. రాష్ట్రంలో మహిళల భద్రత తన బాధ్యతగా భుజస్కందాలపై వేసుకుంటానని భరోసా ఇచ్చారు. ఏ ఆపద వచ్చినా ఒక అన్నగా, కొడుకుగా అండగా ఉంటానని ధైర్యం చెప్పారు.
మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా అన్ని పటిష్టమైన చర్యలు తీసుకునేందుకు టీడీపీ సిద్దంగా ఉందని, దానిపై ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమయ్యాయని చెప్పారు. "అధికారంలోకి రాగానే మహిళలపై జరుగుతున్న ఘోరాలపై దృష్టిపెడతాం. రాష్ట్ర స్థాయిలో ఐజీ స్థాయి అధికారితో ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తాం. జిల్లాస్థాయిలో అడిషనల్ ఎస్పీస్థాయి అధికారి ఈ విభాగాన్ని పర్యవేక్షిస్తారు'' అని వివరించారు. మహిళలు కేంద్రంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను సిద్ధం చేస్తున్నామ న్నారు. "మహిళలను ఆర్థికంగా పైకి తీసుకు వచ్చేందుకు డ్వాక్రా గ్రూపులకు మరింతగా ప్రోత్సాహాలు ఇస్తాం. ఇప్పటివరకూ వారు తీసుకున్న రుణాలను రద్దుచేస్తాం. అలాగే..కొంత మొత్తాన్ని పొదుపు చేస్తే పెళ్లినాటికి మూడు లక్షల వరకూ ఇచ్చే మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెడతాం. వితంతువులకు వెయ్యి రూపాయల పింఛన్, వృద్ధులకు ప్రతి నియోజక వర్గంలో వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేసి సాయాన్ని అందిస్తామని వెల్లడించారు. ఏడాదికి 10 గ్యాస్‌సిలిండర్లు ఇస్తామని, ఆధార్‌తోనూ, బ్యాంకు ఖాతాలతోనూ సంబంధం లేకుండా నేరుగా సబ్సిడీ ధరలకే సిలిండర్లను ఇస్తామని చెప్పారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామని, ఆర్టీసీ, విద్యుత్ ధరలను కూడా అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు. కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్న బెల్టు షాపులను రద్దు చేస్తామని చెప్పారు. "రేషన్‌కార్డులు, ఇండ్ల పట్టాలను మహిళల పేరుతోనే ఇస్తాం. మహిళా కమిషన్‌ను మరింత పటిష్టం చేస్తాం. ఆడపిల్లలకు ప్రత్యేక పాఠశాలలను పెట్టి ఉచిత విద్య అందిస్తాం'' అని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి అనకొండలా పెరిగిపోయిందన్నారు. సోనియా గాంధీ అనకొండ అయితే ఆమె తయారు చేసిన అనకొండలు వైఎస్ జగన్మోహన రెడ్డి, సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రాలంటూ విరుచుకుపడ్డారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలో అనకొండల మాదిరిగా ప్రజల సొమ్మును మెక్కేస్తున్నారని ఆరోపించారు.
ఒకరిది దోపిడీ.. మరొకరిది దందా!
విభజనలో హేతుబద్ధత లేకుండా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకు టీఆర్ఎస్‌తోనూ, వైసీపీతోనూ కలిసి కాంగ్రెస్‌పార్టీ కుట్ర పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు ప్రాంతాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపించాకే విభజన పై ముందుకు పోవాలని సూచించారు. రాజకీయంగా లబ్ధిపొందడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ విభజన అంశాన్ని తీసుకువచ్చిందని దుయ్యబట్టారు.
అవినీతి వ్యతిరేక పార్టీలతోనే పొత్తు
తమ పార్టీకి ఎక్కువ మంది ఎంపీలను అందిస్తే కేంద్రంలో చక్రం తిప్పుతామని చెప్పారు. "ఈసారి మామూలుగా ఉండదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం నుంచి అన్నిరకాల సాయాన్నితీసుకుంటామ''న్నారు. వచ్చేఎన్నికల్లో అవినీతి పై పోరాటం చేసే పార్టీతోనే పొత్తు ఉంటుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ రావడంతోనే భూకబ్జాలు, దోపిడీలు పెరిగిపోయాయని విమర్శించారు. "సైకిళ్ల పై తిరిగిన వారు రాత్రికి రాత్రే కార్లలో తిరుగుతున్నారు. పేదల పొట్టకొడుతున్న వారి పొట్టపగిలే రోజులుదగ్గర లోనే ఉన్నాయి. అన్యాయం చేసే వారి గుండెల్లో నిద్రపోతాను. రౌడీలు, గూండాల పని పడతాను. నాది ఉడుం పట్టు. నేనొక మాట ఇస్తే దాని కోసం కట్టుబడి ఉంటాన''ని చెప్పారు.
చంద్రబాబు.. దమ్మున్న నాయకుడు: నీరజారావు
"నాయకుడంటే ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేవాడు. వారికి అన్యాయం జరిగితే రక్షించేవాడు. అలాంటి దమ్మున్న నాయకుడు చంద్రబాబునాయుడ''ని నీరజారావు కితాబిచ్చారు. వైఎస్ కుటుంబం ఆక్రమణకు గురైన జూబ్లీహిల్స్‌లోని తన భూమిని సుదీర్ఘ పోరాటం తర్వాత దక్కించుకున్న నీరజారావు..మహిళా సదస్సులో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. "అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి బావమరిది రవీంద్రనాధ్ రెడ్డి నా ప్లాటును కబ్జాచేశారు. జగన్‌ను కలిసినా నాకు న్యాయం జరగలేదు. పైగా బెదిరింపులు పెరిగాయి. అధికారులు వారికే వంత పాడారు. ఈ క్లిష్ట సమయంలో చంద్రబాబును కలిశాను. అడిగినంతనే ఆయన స్పందించారు. ఇప్పటిదాకా నాకు వెన్నుదన్నుగా నిలిచారు. ఆయన నిజంగా దమ్మున్న మొగాడు. అలాంటి నాయకుడికి మహిళలు అండగా ఉండాలి. ఆయన అధికారంలోకి వస్తే మీ హక్కులను కాపాడతారు. దానికి సజీవ సాక్ష్యం నా ఉదంతమే'' అని వివరించారు.
- See more at: http://www.andhrajyothy.com/node/49340#sthash.VeUPO91u.dpuf

శ్రీధర్‌బాబుకు షాక్

శ్రీధర్‌బాబుకు షాక్

Published at: 01-01-2014 07:11 AM
 2  2  0 
 
 

సభా వ్యవహారాలు తీసేసుకున్న కిరణ్
ఆ శాఖ సాకే శైలజానాథ్‌కు అప్పగింత
కొత్త ఏడాది ముందు సంచలన నిర్ణయం
శ్రీధర్‌తో తలనొప్పి అనే అనుమానమే కారణం
హైదరాబాద్, డిసెంబర్ 31 : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 'బౌన్సర్' వదిలారు. కొత్త ఏడాది ముందు మంత్రి శ్రీధర్‌బాబుకు ఝలక్ ఇచ్చారు. 3వ తేదీ నుంచి విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగనున్న అత్యంత కీలకమైన సమయంలో... దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నుంచి 'శాసనసభా వ్యవహారాల' శాఖను లాగేసుకున్నారు. మంగళవారం రాత్రి పొద్దుపోయాక ఈ సిఫారసును గవర్నర్ నరసింహన్‌కు ముఖ్యమంత్రి పంపించారు. ఆ సిఫారసును గవర్నర్ కూడా వెంటనే ఆమోదించారు. శ్రీధర్‌బాబు శాఖ మార్చడం ఒక సంచలనం! ఇంతకుమించిన సంచలనం ఏమిటంటే... ఏమాత్రం శషభిషలు, ఆలోచనలకు తావివ్వకుండా శాసనసభ వ్యవహారాల శాఖను సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేల కన్వీనర్‌గా, సమైక్య పోరుకు నేతృత్వం వహిస్తున్న సాకే శైలజానాథ్‌కు శాసనసభా వ్యవహారాలను అప్పగించారు. ప్రొరోగ్ వివాదం, విభజన బిల్లుపై చర్చకు శ్రీకారం... ఈ రెండు వివాదాల్లో తనను, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరించారన్న కోపంతోనే శ్రీధర్‌బాబుకు సీఎం కిరణ్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ముందు సభ ప్రొరోగ్ కాలేదు. బిల్లు రాష్ట్ర శాసనసభకు రానున్న నేపథ్యంలో... సభను ప్రొరోగ్ చేయించాలని, తర్వాత సభను ఎప్పుడు సమావేశ పరచాలనే నిర్ణయాధికారాన్ని తన చేతిలోకి తీసుకోవాలని సీఎం భావించారు. ప్రొరోగ్ చేయాల్సిందిగా స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు లేఖ రాశారు. ఇది... తెలంగాణ నేతలకు గుస్సా తెప్పించింది. 'ప్రొరోగ్‌కు ఒప్పుకునేది లేదు. ఒకవేళ స్పీకర్ లేఖ పంపించినా... శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఆ ఫైలును నా దగ్గరే పెండింగ్‌లో పెడతాను' అని శ్రీధర్‌బాబు బహిరంగంగా ప్రకటించారు.
అంతేకాదు... స్పీకర్ నుంచి వచ్చిన ఫైలును పెండింగ్‌లో పెట్టి చూపించారు కూడా! దీంతో... సభ ప్రొరోగ్ కాకుండా ఆగిపోయింది. కిరణ్ వ్యూహానికి గండి కొట్టినట్లయింది. చివరికి... మంత్రివర్గం సమావేశమై శాసనసభ శీతాకాల సమావేశాలకు ముహూర్తం నిర్ణయించింది. ఇలా 'ప్రొరోగ్' విషయంలో శ్రీధర్‌బాబు ముఖ్యమంత్రి కిరణ్‌తో 'ఢీ అంటే ఢీ' అన్నారు. ఆ తర్వాత... రాష్ట్రపతి నుంచి సభకు ముసాయిదా బిల్లు వచ్చింది. డిసెంబర్ 16న స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. అదేరోజు సభ వాయిదా పడి, తిరిగి సమావేశమైన తర్వాత డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టు విక్రమార్క స్పీకర్ స్థానంలో ఉండగా... బిల్లుపై చర్చకు శ్రీకారం చుట్టడంపై 'చిన్నపాటి డ్రామా' నడిచింది. శాసనసభ వ్యవహారాల మంత్రి హోదాలో మంత్రి శ్రీధర్‌బాబు బిల్లుపై చర్చ చేపట్టాలని కోరడం... ఆ వెంటనే స్పీకర్ స్థానంలో ఉన్న భట్టి విక్రమార్క విపక్షనేత చంద్రబాబు పేరు పిలవడం, ఆ వెంటనే సభను వాయిదా వేయడం జరిగిపోయింది. దీంతో... బిల్లుపై చర్చ మొదలైందా? లేదా? అనే మీమాంస, వివాదం తీవ్రస్థాయిలోనే చెలరేగింది. సాంకేతికంగా చర్చ ప్రారంభమైనట్లుకాదని ఒక వర్గం చెబుతుండగానే... శాసనసభ వ్యవహారాల మంత్రి హోదాలో శ్రీధర్‌బాబు 'చర్చ మొదలైంది' అని ప్రకటించారు. ప్రొరోగ్ వ్యవహారంతో శ్రీధర్‌బాబుపై 'గుస్సా'గా ఉన్న కిరణ్‌కు చర్చ వివాదం మరింత కోపం తెప్పించింది. మరోవైపు... మూడో తేదీ (శుక్రవారం) నుంచి విభజన ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఇలాంటి సమయంలో శాసనసభ వ్యవహారాల శాఖ శ్రీధర్‌బాబు వద్ద ఉంటే తలనొప్పులు వస్తాయనే ఉద్దేశంతోనే ఆయన శాఖను మార్చినట్లు తెలుస్తోంది. శ్రీధర్‌బాబుకు ముఖ్యమంత్రి తన వద్ద ఉన్న శాఖల్లో ఒకటైన వాణిజ్య పన్నుల శాఖను అప్పగించారు.
సమన్వయం కోసమే!
శ్రీధర్‌బాబు శాఖ మార్పుపై ముఖ్యమంత్రి వర్గీయుల తమ కోణంలో వాదన వినిపిస్తున్నారు. "నిజానికి... రాష్ట్రపతి నుంచి విభజన ముసాయిదా బిల్లు వచ్చిందని, దీనిపై చర్చ జరపాల్సి ఉందని అన్ని శాసనసభా పక్షాల అభిప్రాయం కోరుతూ శాసనసభా వ్యవహారాల మంత్రి తీర్మానం ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. కానీ, శ్రీధర్‌బాబు నేరుగా చర్చ మొదలైందని ఏకపక్షంగా చెప్పేశారు. ఇది సమంజసం కాదు'' అని సీఎం సన్నిహితులు పేర్కొంటున్నారు. శాసనసభ నడిపేందుకు నియమ నిబంధనలు, సంప్రదాయాలు ఉంటాయని... ప్రాంతాలు, వివాదాలతో నిమిత్తం లేకుండా ఎవరైనా వాటిని అనుసరించాల్సిందేనని స్పష్టం చేశారు. అంతేకాదు, ముఖ్యమంత్రికి, శాసనసభ వ్యవహారాల మంత్రికి మధ్య సభలో సమన్వయం అత్యంత అవసరమని, అది లేకుండా సభను నడిపించడం కష్టమని చెబుతున్నారు. అందువల్లే శ్రీధర్‌బాబు శాఖ మార్చినట్లు పేర్కొంటున్నారు. వాణిజ్యపన్నుల శాఖ కూడా కీలకమైనదేనంటూనే... 'ఆ శాఖను శ్రీధర్‌బాబు తీసుకుంటారా? లేదా? వేచి చూడాల్సిందే' అని ఓ నేత అన్నా
- See more at: http://www.andhrajyothy.com/node/49139#sthash.dLyZvexc.dpuf

బ్రెడ్ ఫోర్క్ వాడినందుకు విడాకులు!

బ్రెడ్ ఫోర్క్ వాడినందుకు విడాకులు!

Sakshi | Updated: January 01, 2014 00:46 (IST)
బ్రెడ్ ఫోర్క్ వాడినందుకు విడాకులు!
ఈ ఫొటోలో ఎడమ వైపున ఉన్నది బ్రెడ్ ఫోర్క్.. గతంలో వాడేవారులెండి. ఇక పక్కనున్నది ఫోర్క్. ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. పచ్చి బఠాణీ తినడానికి ఫోర్క్‌కు బదులు బ్రెడ్ ఫోర్క్ వాడినందుకు కువైట్‌లో ఓ మహిళ పెళ్లైన వారం రోజులకే భర్త నుంచి విడాకులు ఇప్పించాలంటూ కోర్టుకెక్కింది! అతనికి టేబుల్ మ్యానర్స్ లేదని.. జీవితమంతా భర్తతో కలిసి ఉండ టం అసాధ్యమంటూ వాపోయింది. విడాకులు తీసుకోవడానికి ఇదేం కారణం అని ఆశ్చర్యపోతున్నారా? అయితే, అక్కడే గతంలో జరిగిన మరో ఉదంతం గురించి వినండి.. దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది.

టూత్‌పేస్ట్ వేసుకునేటప్పుడు ట్యూబ్ చివర్న కాకుండా మధ్యలోనే నొక్కాలని భర్త చెబుతున్నాడంటూ అక్కడ ఓ మహిళ విడాకుల కోసం కోర్టుకెక్కింది!  ‘దీని మీద మేమెన్నోసార్లు వాదించుకున్నాం. అయ్యో.. ట్యూబ్ చివర్న నొక్కాలయ్యా అంటే వినడే. మూర్ఖుడు’ అంటూ అంతెత్తున లేచింది. మరొక కేసు విషయానికొస్తే.. తాను అడిగినప్పుడు మంచి నీళ్లు తేలేదనే కారణంతో భార్య నుంచి విడాకులిప్పించాలని ఓ భర్త కోర్టును ఆశ్రయించాడు. కువైట్‌లో ఇలా చిత్రవిచిత్ర కారణాల మీద విడాకులు కోరేవారి సంఖ్య ఎక్కువైపోతోందని అధికారులు చెబుతున్నారు.

కౌగలించుకోలేదని బోయ్ ఫ్రెండును పొడిచేసింది!

PTI | Updated: January 01, 2014 13:29 (IST)
వాషింగ్టన్ : కౌగలించుకోడానికి నిరాకరించాడన్న కోపంతో.. అమెరికాలో ఓ మహిళ తన బోయ్ ఫ్రెండును కత్తితో పొడిచేసింది!! దాంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఫ్లోరిడాలోని మనాటీలోని తమ నివాసంలో షవోనా రంఫ్, ఆమె బోయ్ ఫ్రెండు కలిసి మద్యం తాగుతున్నారు.  కాసేపటి తర్వాత ఇద్దరూ పడుకున్నారు.  కానీ ఆమెను కౌగలించుకోడానికి అతడు నిరాకరించాడు.

దాంతో వారిద్దరి మధ్య గొడవ మొదలైంది. బోయ్ ఫ్రెండు షర్టును రంఫ్ లాగేసింది. దాంతో అది కాస్తా చిరిగిపోయింది. చివరకు ఆమె వంటింట్లో ఉపయోగించే కత్తి తీసుకుని అతగాడిని పొడిచేసింది. అతడు పారిపోవడానికి కూడా ఓ దశలో ప్రయత్నించాడు. ఈ సంఘటనతో రంఫ్ ను అరెస్టు చేసినట్లు మాంటీ ప్రాంత పోలీసు కార్యాలయం తెలిపింది. ఆ తర్వాత 250 డాలర్ల బాండు సమర్పించడంతో విడుదల చేశారు.

శృంగారానికి తిరస్కరించాడని ప్రియుడిపై హత్యాయత్నం

Published at: 02-01-2014 08:43 AM
 New  0  0 
 
 

ఫ్లోరిడా: తనతో శృంగారంలో పాల్గొనేందుకు తిరస్కరించిన ప్రియుడిని కత్తితో బెదిరించినందుకు 31 ఏళ్ల షవొన్నా రంప్‌ను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. గత వారం ఫ్లోరిడాలోని తమ నివాసంలో మద్యం సేవించిన తర్వాత షవొన్నా తన ప్రియుడిని శృంగారంలో పాల్గొనాలని కోరింది. దానికి అతను తిరస్కరించి ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో షవొన్నా కత్తితో బెదిరించింది. దీనిపై ఆగ్రహించిన ప్రియుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్రియురాలిని అరెస్ట్ చేసిన అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.
- See more at: http://www.andhrajyothy.com/node/49548#sthash.osrs3o2Y.dpuf